శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2016 (16:11 IST)

తిరుచానూరు మాస్టర్‌ ప్లాన్‌ ఏమైంది...!

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం రోజురోజకు ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. తిరుమల తర్వాత అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం సహా అనేక స్థానిక ఆలయాలున్నా.. తిరుచానూరు పద్మ

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం రోజురోజకు ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. తిరుమల తర్వాత అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం సహా అనేక స్థానిక ఆలయాలున్నా.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య బాగా పెరుగుతోంది. రోజుకు 40 వేల మందికిపైగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అందుకే తితిదే కూడా తిరుచానూరు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 
 
తిరుమల తరహాలో తిరుచానూరును తీర్చిదిద్దడానికి కృషి చేస్తోంది. భక్తుల సౌకర్యం కోసం పీఏసి (పిలిగ్రిమ్‌ అమెనిటీస్‌ కాంప్లెక్స్) నిర్మిస్తోంది. అన్న ప్రసాద వితరణ కేంద్రం కొత్తగా నిర్మిస్తోంది. రోడ్లను అందంగా తీర్చిదిద్దుతోంది. ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తోంది. తిరుచానూరు పంచాయతీ ముందుకు వస్తే గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు ఇస్తామని తితిదే ప్రకటించింది. ఇలా తిరుచానూరులో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్థి పనులు చేపట్టింది. 
 
తిరుచానూరును ఆధ్మాత్మిక పట్టణంగా తీర్చిదిద్దడం కోసం తిరుచానూరు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని తితిదే భావించింది. తిరుమల తరహాలో మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయాలని అనుకుంది. ఈ మేరకు ధర్మకర్తల మండలిలో 2013లో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీన్ని ప్రభుత్వానికి కూడా పంపారు. ఇది జరిగితే తిరుచానూరు పాలన తితిదే అధికారుల చేతుల్లోకి వెళుతుంది. ప్రస్తుతం తిరుచానూరు జనాభా 20 వేలకు పైగానే ఉంది.  తిరుచానూరుకు పోటెత్తుతున్న భక్తులకు అనుగుణంగా పంచాయతీ సదుపాయాలు కల్పించలేకపోతోంది. తితిదే తన ఇష్టమొచ్చినట్లు పనులు చేపట్టడానికి లేదు. ఏమీ చేయాలన్నా పంచాయతీ అనుమతి తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్‌ చట్టం 1984 సెక్షన్‌ 5(1) ప్రకారం తిరుచానూరును అనుబంధ పట్ణణంగా ప్రకటించిస్తూ గతంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
 
తిరుచానూరును మత సంబంధ పట్టణంగా ప్రకటిస్తే దేవదాయ ధర్మాదాయ చట్టం 1987 ప్రకారం ఇక్కడ భిక్షాటన, మత్తుపానీయాల సేవనం, మాంసం విక్రయాలు, జంతు వధ, పక్షుల వధ, జూదం నిషేధించబడతాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ అన్యమత ప్రచార నిషేధ చట్టం-2007 ప్రకారం పరమత ప్రచారం నిర్వహించడాన్ని నిషేధించవచ్చు. ఇంకా తిరుచానూరు పంచాయతీకి ఎన్నికలు నిర్వహించరు. ప్రజాప్రతినిధులు ఉండరు. మొత్తం పాలనా వ్యవహారాలన్నీ తితిదే ఆధీనంలోనే జరుగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే తిరుమల తరహా పాలన మొదలవుతుంది. దీని వల్ల భక్తుల కోసం ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా తితిదేకి సులభమవుతుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నాటి తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపారు.
 
తిరుచానూరును మత సంబంధమైన పట్టణంగా ప్రకటించడానికి చాలా ఆటంకాలు ఉన్నాయన్న వాదనలు స్థానికుల నుంచి వినిపించాయి. పంచాయతీలలో అన్ని మతాల వారు నివసిస్తున్నారని, చర్చీలు, మసీదులు వంటి ప్రార్థనా మందిరాలు ఉండటం వల్ల అది సాధ్యం కాదని గట్టిగా వాదించారు. ఆందోళనలు కూడా నిర్వహించారు. దీంతో ఆ ప్రతిపాదన మరుగునపడి పోయింది. ఇప్పుడు దాన్ని యధాతథంగా ఆమోదించాలనో, అమలు చేయాలనో చెప్పడం లేదు గానీ తిరుచానూరును విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం మాత్రం కనిపిస్తోంది. మతపరమైన పట్టణంగా ప్రకటించకుండానే భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాల్సిన ఆవశ్యకత ముందుకొస్తోంది. పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి తదితర ప్రభుతత్వ విభాగాలతో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలి. లేకుంటే రద్దీని తట్టుకోవడం కష్టమవుతుంది.