మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 జులై 2015 (16:03 IST)

గోదావరి పుష్కరాలు: నీటి కోసం మహారాష్ట్రతో చర్చ.. భద్రాద్రిలో భక్తుల కోసం లడ్డూలు..

గోదావరి పుష్కరాలు ఈ నెల 14వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. పుష్కరాల కోసం తెలుగు రాష్ట్రాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. అయితే వర్షాలు కురవకపోవడంతో గోదావరి నీళ్లు లేకుండా వెలవెలబోతోంది. పుష్కర ఘాట్లకు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో పుష్కరాలు జరుగనున్నాయి. ఆయా జిల్లాలకు ప్రాజెక్టుల్లోని నీటిని మళ్లించాలని నిర్ణయించారు. 
 
మరోవైపు గోదావరి పుష్కరాలకు భద్రాచలంలో అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాజమండ్రి కంటే భద్రాచలం పుష్కరాలకు ఎక్కువ భక్తులు వస్తారని.. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 20 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు.
 
గోదావరి పుష్కరాల కోసం నీటిని విడుదల చేయడంపై మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు చర్చించింది. దీనిపై మహారాష్ట్ర సానుకూలంగా స్పందించిందని, శనివారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా జరుగుతున్న పుష్కరాలు కావడంతో కుంభమేళా తరహాలో భారీ ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ప్రజలు సైతం పెద్ద ఎత్తున పుష్కరాల్లో పుణ్యస్నానాలకు సిద్ధం అవుతుండగా, ఘాట్లలో నీరు లేవనే వార్తలు వారికి నిరాశ కలిగించాయి. దీనిపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాసరలో నీరు లేకపోవడంపై ప్రధానంగా చర్చించారు.
 
స్నానాల గదుల విషయంలో ఎక్కడా అశ్రద్ధ వహించరాదని సూచించారు. పుష్కర ఘాట్లను శుభ్రంగా ఉంచాలని, అధికారులు దీనిపై శ్రద్ధ చూపించాలని కోరారు. గత పుష్కరాలతో పోలిస్తే భక్తుల సంఖ్య ఈసారి నాలుగైదు రేట్లు ఎక్కువగా ఉంటుందని హరీశ్‌రావు తెలిపారు.