గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (11:36 IST)

భద్రాద్రి రామన్న ఆలయంలో సీతమ్మ వారి పుస్తె కనిపించట్లేదట!

భద్రాద్రి రామన్న ఆలయంలో సీతమ్మవారి పుస్తెతో పాటు రెండు ఆభరణాలు గల్లంతు కావడం ప్రస్తుతం కలకలం సృష్టించింది. వాస్తవానికి ఆలయంలోని బంగారు నగలు మాయమయ్యాయంటూ మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది.

భద్రాద్రి రామన్న ఆలయంలో సీతమ్మవారి పుస్తెతో పాటు రెండు ఆభరణాలు గల్లంతు కావడం ప్రస్తుతం కలకలం సృష్టించింది. వాస్తవానికి ఆలయంలోని బంగారు నగలు మాయమయ్యాయంటూ మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు నిత్యకల్యాణం సందర్భంగా వినియోగించే సీతమ్మవారి మంగళసూత్రం, లక్ష్మణస్వామికి కల్యాణ సమయంలో సమర్పించే ఆభరణ సమర్పణ పతకం (బంగారం లాకెట్‌) అదృశ్యమైందనే విషయాన్ని ఈవో రమేష్ బాబు ఆదివారం తేల్చారు.
 
ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాల నేపథ్యంలో పుస్తె, ఆభరణాల మాయంపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధచార్యులు, సీతారామానుజాచార్యులను ఆదేశించారు. దీంతో వారు తమ అర్చక సిబ్బందితో ఈవో ప్రత్యేక అనుమతితో ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి, ఆభరణాలను లెక్కలు సరిచూసుకున్నారు. 
 
మూడు గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. కాగా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్ధానంలో మొత్తం 25 మంది అర్చకులు వివిద హోదాల్లో పనిచేస్తున్నారు. ఈ నగలు మాయం కావడం నిజమేనని, రామాలయంలోని నిత్యకల్యాణ బంగారు ఆభరణాలను భద్రపరిచే బీరువాలో రెండు ఆభరణాలు లేనిమాట వాస్తవమేనని భద్రాచల దేవస్థానం ఈవో టి.రమేశ్‌ బాబు తెలిపారు. 
 
ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నిత్య కల్యాణానికి వినియోగించే సీతమ్మవారి మంగళ సూత్రం, లక్ష్మణస్వామికి సమర్పించే ఆభరణ సమర్పణ పతకం కనబడటం లేదని అర్చకులు తెలిపినట్లు వెల్లడించారు. వారు సోమవారం సాయంత్రం వరకు గడువు కోరారని, అనంతరం తాను పూర్తిస్థాయిలో ఆభరణాలను తనీఖీ చేసి వివరాలను వెల్లడిస్తానన్నారు.