బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (09:23 IST)

3 రోజుల్లో 2.5 లక్షల మంది భక్తులకి శ్రీవారి దర్శనం.. రూ.3.85 కోట్ల ఆదాయం

గత మూడు రోజుల్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2.5 లక్షలుగా ఉంది. వారాంతపు సెలవులతో పాటు తమిళ పవిత్ర పెరటాసి మాసం కావడంతో తిరుమల కొండపై అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైన రద్దీ శని, ఆదివారాల్లో పూర్తి స్థాయిలో ఉండగా, ఆదివారం సాయంత్రం నుంచి తగ్గుతూ వచ్చింది. ఆదివారం ఒక్కరోజే స్వామివారిని 87,101 మంది భక్తులు దర్శించుకోగా, మూడు రోజుల్లో 2.5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నట్టు తితిదే ఆలయ అధికారులు వెల్లడించారు. 
 
మరోవైపు శ్రీవారి హుండీ ఆదాయం అత్యధికంగా రూ.3.85 కోట్ల మేరకు వచ్చినట్టు వారు తెలిపారు. అదేసమయంలో వీఐపీ దర్శనం టిక్కెట్లపై కూడా తితిదే అదనపు లడ్డూలను జారీ చేయడం ఆదివారం ప్రారంభించింది. ఈ ప్రకారం టిక్కెట్టు కొనుగోలు సమయంలో గరిష్టంగా ఆరు లడ్డూలు పొందడానికి అవకాశం ఇచ్చింది.
 
ఇదిలావుండగా, సోమవారం ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.