బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2016 (14:49 IST)

పుష్కర ఘాట్లలో నీళ్ళెక్కడ? మోకాళ్ల లోతు నీటిలో మునకెలా? జల్లు స్నానాలతో సరి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కృష్ణా పుష్కరాల తొలిరోజునే భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. పుష్కరాల కోసం వచ్చే యాత్రికులు స్నానం చేసేందుకు వీలుగా కృష్ణా బ్యారేజీకి దిగువ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కృష్ణా పుష్కరాల తొలిరోజునే భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. పుష్కరాల కోసం వచ్చే యాత్రికులు స్నానం చేసేందుకు వీలుగా కృష్ణా బ్యారేజీకి దిగువ భాగంలో ఏర్పాటు చేసిన ఘాట్లలో చుక్కనీరు లేదు. ఒక వేళ నీరు ఉన్నా.. అది మోకాళ్ళలోతు వరకే ఉంది. దీంతో పుష్కర యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
వాస్తవానికి శ్రీశైలం నుంచి ఎగువకు నదిలో నీరున్నప్పటికీ, దిగువన ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ కింద ఏర్పాటు చేసిన ఏ ఘాట్‌కు కూడా నీరు చేరని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు పైపుల ద్వారా జల్లు స్నానాలు చేసే ఏర్పాటు చేయగా, భక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కనీసం 4 అడుగుల మేరకు నీరుంటే తప్ప ఓ మునక వేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చాలా ఘాట్లలో రెండడుగుల నీరు కూడా లేదు. మోకాళ్లలోతు నీటిలో మునకెలా వేయాలో తెలియక భక్తులు నానా తిప్పలు పడుతున్నారు. 
 
నాగార్జున సాగర్ దిగువున దేశాలమ్మ, సత్రశాల పరిధిలో 2 అడుగుల మేరకు నీరుండగా, దైదలో ఒక అడుగు మేరకు మాత్రమే నీరుంది. పులిచింతల ప్రాజెక్టు సమీపంలోని గోవిందాపురం, ఎల్లంపల్లి, రేగులగడ్డల్లో అసలు నీరే లేదు. ఇక ప్రకాశం బ్యారేజీలో 12 అడుగుల మేరకు నీరుండగా, దిగువ ఘాట్లకు కాస్తంత వదలడంతో, అది 10 అడుగులకు చేరింది. 
 
బ్యారేజ్ దిగువన పెనుమూడి ఘాట్‌ను అర కిలోమీటర్ పొడవులో నిర్మించగా, భక్తుల స్నానాలకు చాలినంత నీరు వదలాలంటే, బ్యారేజ్ ఎగువన దుర్ఘా ఘాట్‌కు నీరు చాలని పరిస్థితి నెలకొంది. బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో 38 ఘాట్లను అధికారులు ఏర్పాటు చేయగా, ఏ ఘాట్ దగ్గర కూడా నిండా మునిగేంత నీరు లేదు. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి నీరు వస్తేనే కానీ భక్తులు సంతృప్తిగా పుష్కర స్నానం చేయలేని పరిస్థితి నెలకొంది.