శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (13:07 IST)

ఆన్‌లైన్‌లో శీఘ్రదర్శన టిక్కెట్ల కోటాను పెంచబోం : తితిదే ఈవో

ఆన్‌లైన్‌లో రూ.300 విలువ చేసే శీఘ్రదర్శన టిక్కెట్ల కోటాను ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచబోమని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఈ టిక్కెట్ల జారీలో అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. గతంలో శీఘ్రదర్శనం టికెట్లు పెంచడం ద్వారా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే తిరుమల ఘాట్‌ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దీనిపై ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాల విషయంలో కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. రెండు ఘాట్‌ రోడ్డులకు ఇరువైపుల తిరుమలలో వృథా జలాలను పైపు లైను ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతోందన్నారు. దీని ద్వారా అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినా, ఇతర పచ్చదనం పరిరక్షణకు ఉపయోగపడుతుందన్నారు.
 
త్వరలో తమిళనాడులోని శ్రీవారి భక్తుల కోసం కోసం ఎస్‌విబిసి తమిళ్‌ చానెల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవకులు విషయంలో నూతనంగా సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రత్యేకంగా శ్రీవారి సేవకులకు శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నామని, వారి ద్వారానే హిందూ ధర్మప్రచారం చేపడుతున్నామన్నారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ద్వారా శ్రీవారి సేవకులు తీసుకువచ్చే ప్రక్రియ త్వరలో జరుగుతుందన్నారు. 
 
ఈనెల 10వ తేదీ నుంచి శ్రీ రామానుజచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలను యేడాది మొత్తంగా 106 దివ్య దేశాల్లో ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు. తిరుమల నుంచి కేరళ, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో సహస్రాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మరోవైపు ఈనెల 22 నుంచి 29 వరకు శుభప్రదం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఇందులో నవ్యాంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి 23 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నట్లు తెలిపారు.