శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 23 మే 2016 (11:34 IST)

తిరుమలలో పోటెత్తిన భక్తులు, రోడ్లపైకి వచ్చిన భక్తుల క్యూలైన్లు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత రెండు రోజులుగా ఉన్న రద్దీని పోలిస్తే సోమవారానికి మరింత పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనం వద్ద తితిదే ఏర్పాటు చేసిన క్యూలైన్లు కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. గంటలకు గంటలు రోడ్లపైనే దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు.
 
సోమవారం ఉదయం 5 గంటల నుంచి కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి రెండు కిలోమీటర్లకు క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తుల పరిస్థితి అదే. అలిపిరి పాదాలమండపం, శ్రీవారి మెట్ల గుండా వందలాదిమంది భక్తులు గోవిందనామస్మరణలు చేసుకుంటూ తిరుమలకు చేరుకుంటున్నారు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల్లోను, కాలినడక భక్తులకు 9 గంటల్లో దర్శనం చేయిస్తామని తితిదే చెబుతోంది. గదులు ఖాళీ లేవు. 
 
ఎక్కడ చూసినా రద్దీ రద్దీ. తలనీలాల వద్ద భక్తులే భక్తులు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు.  విఐపిల తాకిడి కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తితిదే మాత్రం ఎప్పటిలాగే చేతులెత్తేసింది. గదులు లేక భక్తులు రోడ్లపైనే పడిగాపులు. అర్థరాత్రి నుంచి భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలని తితిదే ప్రయత్నం చేస్తోంది.