శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2016 (09:13 IST)

అఖిలాండ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న బాబు..

అఖిలాండ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సోమవారం (అక్టోబర్-3) స్వామివారు పెద్దశేషవాహనంపై ఊరేగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయ

అఖిలాండ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సోమవారం (అక్టోబర్-3) స్వామివారు పెద్దశేషవాహనంపై ఊరేగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు సోమవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల గిరులు భక్తజన సందోహంతో నిండిపోయాయి. 
 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అంకురారోపణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముందుగా యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనులవారు నాలుగు మాడవీధుల్లో ప్రదక్షిణగా బయల్దేరి పడమర దిశలో ఉన్న వసంతం మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ మృత్సంగ్రహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతంలో భూమిపూజ తదితరాలను నిర్వహించి పాలికలలో పుట్టమన్ను సేకరించారు. తర్వాత మిగిలిన తిరువీధి ప్రదక్షిణగా సేనాధిపతి ఆలయానికి చేరుకున్నారు.
 
సంపంగి ప్రాకారంలోని మండపంలో అంకురారోపణను అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా.. నిత్యం సాయంత్రం నిర్వహించే వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా.. సోమవారం ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయంలోని ధ్వజస్తంభానికి గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలనూ ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. ధ్వజారోహణం సందర్భంగా ఉభయనాంచారీ సమేతుడైన మలయప్పకు ఉదయం బంగారువాకిలిలో విశేష సమర్పణ చేస్తారు.