శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (13:04 IST)

తిరుమల శ్రీవారి డిపాజిట్ తగ్గిపోతోంది.. మూడేళ్ళలో రూ.500 కోట్లు తగ్గిందట...!

తిరుమల తిరుపతి దేవస్థానం 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,858 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.2,678 కోట్లతో బడ్జెట్ రూపొందించగా ఆచరణలో దాన్ని రూ.2,812

తిరుమల తిరుపతి దేవస్థానం 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,858 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.2,678 కోట్లతో బడ్జెట్ రూపొందించగా ఆచరణలో దాన్ని రూ.2,812 కోట్లకు సమర్పించారు. అంటే 2016-17లో అంచనాలకు మించి ఆదాయం లభించింది. దీన్ని ఆధారంగా చేసుకుని 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.2,858కోట్ల అంచనాతో బడ్జెట్ రూపొందించారు. ఇది సవరించే అంచనాల్లో రూ.3 వేల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. 
 
శ్రీవారి హుండీ ఆదాయాన్ని వెయ్యి కోట్లుగా అంచనా వేయగా ఆచరణలో రూ.1,110 కోట్లుగా చూపారు. అంటే రూ.110 కోట్లు పెరిగిందన్నమాట. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టిక్కెట్ల ద్వారా రూ.170 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే ఆచరణలో రూ.226 కోట్లు వచ్చింది. అంటే రూ.56 కోట్లు అదనంగా వచ్చిందన్నమాట. ఇక తలనీలాల విక్రయం ద్వారా రూ.150 కోట్లు వస్తుందని అంచనా వేయగా అది రూ.100 కోట్లకే పరిమితమైంది. ఇంజనీరింగ్ బడ్జెట్ గత యేడాది రూ.160 కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.200 కోట్లు మంజూరు చేశారు. 
 
తితిదే బడ్జెట్ గణాంకాలు చూస్తుంటే కొంత ఆందోళన కలుగుతోంది. కారణాలు ఏవైనా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో స్వామి హుండీ ఆదాయం పెరుగుతున్నా డిపాజిట్ చేసే సొమ్ము మాత్రం తగ్గిపోతోంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. సాధారణంగా హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ ఆదాయంగా పరిగణిస్తారు. ఈ కానుకల ద్వారా వచ్చే ఆదాయాన్ని శాశ్వత పనులకు వినియోగించగా మిగిలిన దాన్ని డిపాజిట్ చేయాలి. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రావడం వల్ల ఆలయ నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 
 
అయితే డిపాజిట్ చేసే మొత్తమే తగ్గిపోతోంది. 2016-17లో రూ.757 కోట్లు డిపాజిట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆచరణలో డిపాజిట్ చేసింది రూ. 475 కోట్లు మాత్రమే. అంటే అంచనాల కంటే రూ.275 కోట్లు డిపాజిట్లు తగ్గాయన్న మాట. అదే 2014-15లో రూ.969 కోట్లు డిపాజిట్ చేశారు. 2015-16లో ఇది రూ.783 కోట్లు అయ్యింది. ఇప్పుడు రూ.475కు తగ్గింది. అంటే మూడేళ్ళ క్రితంతో పోల్చితే డిపాజిట్ మొత్తం దాదాపు రూ.500 కోట్లు తగ్గాయన్నమాట. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయాన్ని సరిపెట్టుకోవాలి. 
 
అయితే ఇటీవల వడ్డీ ద్వారా వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో హుండీ కానుకలనూ రోజువారీ ఖర్చులకు వాడుతున్నారు. అందుకే ఈ యేడాది డిపాజిట్ చేసిన మొత్తం భారీగా తగ్గింది. ఖర్చులు అదుపు చేసుకోగలిగితే ఈ పరిస్థితి ఉండదు. డిపాజిట్లు తగ్గడం వల్ల వచ్చే వడ్డీ కూడా తగ్గుతోంది. 2014-15లో రూ.714 కోట్ల వడ్డీ వచ్చింది. 2015-16లో రూ.759 కోట్లు అయ్యింది. 2016-17లో వడ్డీని రూ.762 కోట్లుగా చూపించారు. 2017-18లో వడ్డీ రూపంలో రూ.807 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.