తితిదే పాలకమండలి నుంచి సాయన్నను తొలగిస్తూ ఉత్తర్వులు... ప్రమాణ స్వీకారం లేకుండానే...
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయన్నను తొలగిస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జి.ఓ.నెంబర్ 187ను దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్ విడుదల చేశారు.
టిటిడి పాలకమండలి సమావేశం జరిగే సమయంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్లోకి జంప్ అయ్యారు సాయన్న. అంతేకాకుండా నాలుగుసార్లు జరిగిన పాలకమండలి సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో పాలకమండలి నుంచి సాయన్నను తొలగిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి జీవో జారీ చేశారు.
మరోవైపు... తితిదే పాలకమండలి ఛైర్మన్గా మరో యేడాది పాటు చదలవాడ క్రిష్ణమూర్తిని నియమిస్తూ సంతకం చేసిన జిఓ పత్రాలు చదలవాడ కృష్ణమూర్తికి చేరాయి.. గతనాలుగు రోజులకు ముందే ముఖ్యమంత్రి టిటిడి పాలకమండలిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దీంతో దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శ జె.ఎస్.వి.ప్రసాద్ పాలకమండలిని కొనసాగిస్తూ జి.ఓ.నెంబర్ 188ని విడుదల చేశారు.
ఈ జిఓ నెంబర్ ప్రకారం 15మంది పాలకమండలి సభ్యులతో పాటు టిటిడి ఛైర్మన్ అదే పదవిలో కొనసాగనున్నారు. అయితే దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేసిన జిఓ సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు ఛైర్మన్తో పాటు సభ్యుల చేతికి చేరింది. జిఓ ప్రకారం సభ్యులెవరు తిరిగి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేకుండానే, పాలకమండలి సభ్యులుగా కొనసాగనున్నారు.