గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 23 మే 2016 (15:34 IST)

భావి భారత నిర్మాణానికి నాంది శుభప్రదం : తితిదే ఛైర్మన్‌ చదలవాడ

పిల్లలకు భారతీయ సనాతన ధర్మం, మానవీయ, నైతిక విలువలు బోధించేందుకు ఉద్దేశించిన 'శుభప్రదం' వేసవి శిక్షణా తరగతుల కార్యక్రమం భావి భారత నిర్మాణానికి నాంది అని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న శుభప్రదం శిక్షణ కార్యక్రమం తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ, పి.జి.కళాశాలలో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఛైర్మన్‌ మాట్లాడుతూ భారతీయులు వేదాల నుంచి ఉద్భవించారని, ధర్మబద్ధంగా ఉండటం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక సంపన్నులుగా జీవిస్తున్నారని తెలిపారు. మన పూర్వీకులు మనకు అందించిన వేదాల్లోని సారాన్ని, ఆధ్మాత్మిక చింతన చిన్నతనం నుంచి అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. 
 
సమాజంలో నడుచుకోవాల్సిన తీరు, మానవత్వంతో వ్యవహరించాల్సిన విధానం, దైవత్వం సాధించేందుకు చేయాల్సిన కృషి తదితర విషయాలను ఈ శిక్షణలో విద్యార్థులకు బోధిస్తున్నట్లు తెలిపారు. టీనేజిలో విద్యార్థులకు బోధిస్తున్నట్లు తెలిపారు. యుక్తవయస్సులో ప్రతి మానవునిలో గొప్ప పరిణామం కలుగుతుందని, ఈ వయసులో నేర్చుకునే విషయాలు జీవితాంతం గుర్తుండిపోతామని వివరించారు. ఈ కారణంగానే భారత యువతను ఆధ్మాత్మికంగా శక్తిమంతులను చేసేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
 
తితిదే ఈఓ సాంబశివరావు మాట్లాడుతూ శుభప్రదంలో శిక్షణ పొందిన విద్యార్థులు ధర్మప్రచారానికి వారధులని, మీ ద్వారా సనాతన విలువలు ఎక్కువ మందికి వ్యాప్తి చెందాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో ఆధ్మాత్మిక, మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయని, వాటిని తిరిగి పెంపొందించేందుకు ఈ తరగతులు దోహదపడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సనాతన సంప్రదాయ విలువలు పాటించే మంచి కుటుంబాన్ని తయారు చేయగలితితే మంచి సమాజం తయారవుతుందన్నారు. 
 
2012 నుంచి గత నాలుగు సంవత్సరాలుగా వేలాదిమంది విద్యార్థులకు శుభప్రదం శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యేడాది శుభప్రదం కార్యక్రమం మే 22వ తేదీ నుంచి 29 వరకు వారం రోజుల పాటు 8,9,10వ తరగతులకు చెందిన 23 వేల మంది విద్యార్థిని, విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 45 కేంద్రాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.