గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 28 మార్చి 2017 (21:32 IST)

మళ్ళీ లేఖ రాస్తా - తితిదే ఈఓ సాంబశివరావు.. ఎవరికి?ఎందుకు?

ఆర్బిఐకి టిటిడి కార్యనిర్వహణాధికారి లేఖ రాయడం ఏమిటనుకుంటున్నారా.. ఏమి లేదండి... ఇప్పటికే పాత పెద్దనోట్లు రద్దయి తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో మూలుగుతున్న 9 కోట్ల పాత పెద్దనోట్లను మార్చుకోమని ఆర్ బిఐని మరోసారి లేఖ ద్వారా కోరనున్నారు తితిదే ఈఓ సాం

ఆర్బిఐకి టిటిడి కార్యనిర్వహణాధికారి లేఖ రాయడం ఏమిటనుకుంటున్నారా.. ఏమి లేదండి... ఇప్పటికే పాత పెద్దనోట్లు రద్దయి తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో మూలుగుతున్న 9 కోట్ల పాత పెద్దనోట్లను మార్చుకోమని ఆర్ బిఐని మరోసారి లేఖ ద్వారా కోరనున్నారు తితిదే ఈఓ సాంబశివరావు. ఇప్పటికే ఆ నోట్లు చెల్లవని, ఆ నోట్లను తీసుకోమని కేంద్రప్రభుత్వమే స్పష్టం చేసిన తరువాత కూడా తితిదే ఈఓ మళ్ళీ లేఖ రాస్తానని చెప్పడం ఏమిటో అర్థం కావడం లేదు ఆ సంస్థ అధికారులకే.
 
నల్లధనాన్ని బయటకు తీయడానికి ప్రధాని నరేంద్రమోడీ పాత పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల వరకు నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే షరతులతో కూడిన అవకాశం. అయితే చాలామంది మాత్రం ఆ నోట్లను మారిస్తే ఏదైనా అవుతుందేమోనన్న భయంతో వాటినన్నింటిని తీసుకొచ్చి నేరుగా తిరుమల స్వామివారి హుండీలో వేశారు. అది కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు. పాత పెద్దనోట్లు చెల్లవని కనీసం ముందుగానే టిటిడి బోర్డులు పెట్టకుండా హుండీ ఆదాయం పెరిగిపోతోందంటూ అలాగే వదిలేసింది. ఇంకేముంది..పెద్ద నోట్లు కాస్త కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. 
 
ఆ నోట్లు మార్చుకోవడానికి టిటిడి నానా బాధలు పడింది. అయితే ఆ నోట్లు మారనేలేదు. మొత్తం 9 కోట్ల రూపాయలు. ఇప్పటికీ కూడా ఆ నోట్లు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఉన్నాయి. అయితే ఆ నోట్లు ఏ మాత్రం చెల్లవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రే స్వయంగా పార్లమెంటులో చెప్పారు. అయినా తితిదే ఈఓ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మరోసారి ఆర్ బిఐకి లేఖ రాస్తానని తితిదే ఈఓ నిన్న జరిగిన పాలకమండలి సమావేశంలో తెలిపారు. 
 
ఆర్ బిఐకి గతంలో రాసిన రెండు లేఖలపై ఎలాంటి సమాధానం లేదు. అందులోను కేంద్రప్రభుత్వమే స్వయంగా మారదని తేల్చిచెప్పింది. అయినా సరే తితిదే ఈఓ మాత్రం మొండి పట్టు వదలకుండా ఈ విధంగా లేఖ రాస్తానని చెప్పడంపై మాత్రం ఆ సంస్థ ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ఆ నోట్లే మారకపోతే వాటిని ఏం చేస్తారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.