గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2015 (17:05 IST)

గల్లా జయదేవ్ - సీఎం రమేష్‌లకు క్లాస్ పీకిన చంద్రబాబు!

ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవి కోసం పోటీ పడి పార్టీ పరువును బజారుకీడ్చిన సొంత పార్టీ ఎంపీలైన గల్లా జయదేవ్, సీఎం రమేష్‌లకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవి పోటీ నుంచి ఇద్దరూ తప్పుకుని పార్టీకి చెందిన మరో నేతకు అప్పగించాలని కోరారు. అంతేకాకుండా ఆ నేతను కూడా ఇద్దరూ కూర్చొని ఎంపికే చేయాలంటూ హుకుం జారీ చేశారు. 
 
వాస్తవానికి ఏపీ ఒలింపిక్ అధ్యక్ష పదవికి దక్కించుకునేందుకు వీరిద్దరూ రోడ్డుకెక్కిన విషయం తెల్సిందే. దీనిపై టీడీపీలో పెద్ద చర్చే సాగింది. గల్లా జయదేవ్, సీఎం రమేష్‌లు సిగపట్లు పట్టుకుని మరీ ఎవరికి వారు తామే అధ్యక్షులమని ప్రకటించుకున్నారు. అయితే వారి వాదులాట రాష్ట్రంలో టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగించిందని చంద్రబాబు భావించారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన వారిద్దరికీ తలంటారు. దాదాపు అరగంట పాటు ఇద్దరికీ క్లాసు పీకారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, టీడీపీపీ భేటీకి ముందు సీఎం రమేశ్, గల్లా జయదేవ్‌లను తన కాటేజీకి పిలిపించుకున్నారు. ఇద్దరికీ ఒకేసారి బ్రెయిన్ వాష్ చేశారు. 
 
ఇద్దరూ ఆ పదవిని వదులుకుని, పార్టీకి చెందిన మరో నేతకు ఆ పదవిని అప్పగించమంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక సదరు పదవికి నేతను ఎంపిక చేసే పనిని ఇద్దరూ కలిసి కూర్చుని నిర్ణయించండంటూ ఆయన హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక ఇద్దరు ఎంపీలు చంద్రబాబు ముందు తలాడించక తప్పలేదు.