గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (09:18 IST)

కామన్వెల్త్ గేమ్స్: 'బంగారు' పట్టుపట్టిన భారత రెజ్లింగ్ వీరులు!

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో మంగళవారం భారత కుస్తీవీరులు (రెజ్లర్లు) పసిడి పతకాల పంట పండించారు. పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో అమిత్ కుమార్, 74 కిలోల విభాగంలో ఒలింపిక్ మెడలిస్టు సుశీల్ కుమార్, మహిళల 48 కిలోల విభాగంలో వినేష్ తమతమ ప్రత్యర్థులను కుమ్మేసి పసిడి పతకాల పంట పండించారు. 
 
పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్‌లో అమిత్ కుమార్ 3-1 తేడాతో నైజీరియాకు చెందిన ఎబిక్వెమినోమో వెల్సన్‌ను మట్టి కరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల 48 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్‌లో వినేష్ 3-1 తేడాతో ఇంగ్లండ్ రెజ్లర్ యానా రట్టిగన్‌ను చిత్తుచేసి బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. అలాగే పురుషుల 74 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్‌లో ఒలింపిక్ మెడలిస్టు సుశీల్ కుమార్ విజేతగా నిలిచి భారత్‌కు మంగళవారం మూడో పసిడి పతకాన్ని అందించాడు. 
 
పాకిస్థాన్ రెజ్లర్ కమర్ అబ్బాస్‌తో జరిగిన ఈ బౌట్‌లో సుశీల్ కుమార్ 8-0 తేడాతో తిరుగులేని విజయం సాధించాడు. దీంతో భారత్ మొత్తం 33 పతకాలతో ఐదో స్థానానికి దూసుకెళ్లింది. ఫైనల్స్‌కు ముందు జరిగిన బౌట్లలో సుశీల్ కుమార్‌తో పాటు రాజీవ్ తొమర్, అమిత్ కుమార్ తిరుగులేని విజయాలు సాధించారు. పురుషుల 74, 57 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్లలో సుశీల్ కుమార్, అమిత్ కుమార్ కేవలం గంటన్నర వ్యవధిలో ముగ్గురు బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్స్‌కు దూసుకెళ్లగా, 125 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో జరిగిన రెండు రౌండ్లలో రాజీవ్ తొమర్ సునాయాసంగా విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 
 
74 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో 11-0 తేడాతో ఆస్ట్రేలియా రెజ్లర్ జేడెన్ లారెన్స్‌ను, క్వార్టర్ ఫైనల్‌లో 10-0 తేడాతో శ్రీలంక రెజ్లర్ కుషాన్ సంద్రాగేను మట్టికరిపించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సుశీల్ కుమార్ సెమీఫైనల్‌లో 8-4 తేడాతో నైజీరియా రెజ్లర్ మెల్విన్ బిబోను ఓడించాడు. ఫైనల్‌లో సుశీల్ కుమార్ పాకిస్థాన్ రెజ్లర్ కమర్ అబ్బాస్‌ను చిత్తు చేశాడు.