గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (10:32 IST)

ఆసియా క్రీడల్లో భారత్ : 'బంగారు' తల్లి ఫొగట్‌

జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు. రెండో రోజైన సోమవారం కూడా భారత ఖాతాలో పలు పతకాలు వచ్చి చేరాయి. దేశ టాప్‌ రెజ్లర్‌ వినేశ్ ఫొగట్ తనపై పెట్టుకున్న నమ్

జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు. రెండో రోజైన సోమవారం కూడా భారత ఖాతాలో పలు పతకాలు వచ్చి చేరాయి. దేశ టాప్‌ రెజ్లర్‌ వినేశ్ ఫొగట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే, షూటర్ల గురికి రెండు రజత పతకాలు భారత్‌ ఖాతాలో చేరగా, సెపక్‌తక్రాలో అనూహ్యంగా ఓ కాంస్య పతకం ఖాయమైంది.. ప్రస్తుతానికి రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యంతో పతకాల పట్టికలో భారత్‌ 8వ స్థానంలో నిలిచింది.
 
నమ్మకాన్ని వమ్ము చేయని ఫొగట్‌ 
రెజ్లింగ్‌లో భారత్‌కు తిరుగులేదని ఈ క్రీడల్లో మరోమారు మనోళ్లు నిరూపించారు. పోటీల తొలిరోజు బజరంగ్‌ స్వర్ణ బోణీ కొడితే.. రెండోరోజు, సోమవారం ఆ ఊపును కొనసాగిస్తూ స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ పసిడి పతకం పట్టేసింది. ఫ్రీస్టయిల్‌ 50 కిలోల విభాగం ఫైనల్లో వినేశ్‌కు పోటీ ఇస్తుందని అంచనా వేసిన జపాన్‌ అమ్మాయి యూకీ ఇరీ తేలిపోయింది. 6-2 స్కోరుతో ఫొగట్‌ ఆమెపై విజయం సాధించింది. 
 
ప్చ్‌.. సాక్షి కాంస్యం మిస్‌ 
తొలిరోజు సుశీల్‌ కుమార్‌ నిరాశ పరిస్తే రెండోరోజు మరో ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ వంతైంది. మహిళల 62 కిలోల కాంస్య పతక బౌట్‌లో మరీ రక్షణాత్మక ధోరణి అవలంభించిన సాక్షి 2-12 స్కోరుతో ఉత్తరకొరియా రెజ్లర్‌ జోంగ్‌ సిమ్‌ రిమ్‌ చేతిలో ఖంగుతింది. అలాగే పూజదండ (57కి.), సుమిత్‌ మాలిక్‌ (125కి.) కాంస్య పతక పోరాటంలో పరాజయం చవిచూశారు. ఇక 53 కి.విభాగంలో పింకీ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. 
 
షూటింగ్‌లో రజతాలు 
పాలెంబాంగ్‌లో జరిగిన షూటింగ్‌ పోటీల్లో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. 19 ఏళ్ల యువ షూటర్‌ లక్ష్య్‌ షెరాన్‌ పురుషుల ట్రాప్‌ విభాగంలో (39 పాయుంట్లు) రజత పతకం దక్కించుకున్నాడు. తైపీ షూటర్‌ కున్పీ యాంగ్‌ (48) క్రీడల రికార్డు సమం చేసి పసిడి పతకం నెగ్గాడు. పురుషుల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో 33 ఏళ్ల దీపక్‌ కుమార్‌ (247.7 పాయింట్లు) కూడా రజత పతకం కైవసం చేసుకున్నాడు. 
 
సెపక్‌తక్రాలో కాంస్యం ఖాయం 
ఆసియాడ్‌లో భారత్‌ ఖాతాలో ఓ పతకం అనూహ్యంగా చేరనుంది. పురుషుల సెపక్‌తక్రాలో గ్రూప్‌-బిలో తలపడుతున్న భారత్‌.. తొలి మ్యాచ్‌లో ఇరాన్‌పై నెగ్గి, రెండో మ్యాచ్‌లో ఇండోనేసియాపై ఓడినా సెమీస్‌కు చేరింది. సెమీఫైనల్లో ప్రవేశించిన జట్టుకు కాంస్య పతకం ఖాయమైంది. 
 
బ్యాడ్మింటన్‌లో నిరాశ 
ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్‌లో భారత్ పోరాటం ముగిసింది. సోమవారం వేర్వేరు ప్రత్యర్థులతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత షట్లర్లు అంచనాలకు అందుకోలేక పరాజయం వైపు నిలిచారు. దీంతో పతక ఆశలకు ఫుల్‌స్టాప్ పడింది. 
 
తొలుత పురుషుల టీమ్‌ఈవెంటులో ఆతిథ్య ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1-3తో ఓటమిపాలైంది. అలాగే, మహిళల సింగిల్స్‌లో గంటా 11 నిమిషాల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన పోటీలో సైనా నెహ్వాల్ 11-21, 25-23, 16-21తో నొజోమీ ఒకుహరపై ఓటమిపాలైంది.