బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 2 ఆగస్టు 2015 (12:30 IST)

ఐపీటీఎల్ టోర్నీ : డిసెంబర్ 12న నాదల్ వర్సెస్ ఫెదరర్

ఇంటర్నేషనల్‌ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌) రెండో సీజన్‌ కోసం ముస్తాబవుతోంది. డిసెంబర్ రెండో తేదీ నుంచి ఈ టోర్నీ ఆరంభంకానుంది. అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్ళ కలబోతతో జరిగే ఈ టోర్నీని గత యేడాది కంటే భారీగా నిర్వహిస్తామని టోర్నీ ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేష్‌ భూపతి వెల్లడించారు. ఈ టోర్నీలో భాగంగా డిసెంబర్ 12వ తేదీన రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుందని చెప్పారు. 
 
దీనిపై మహేష్ భూపతి మాట్లాడుతూ... ‘కొత్త ఫార్మాట్‌తో వచ్చిన ఐపీటీఎల్‌-1 ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారులను ఆసియాలోని వివిధ నగరాలకు తొలిసారిగా రప్పించింది. వారికి అభిమానులు అద్భుత స్వాగతం పలికారు. రెండో సీజన్‌ మరింత ఆసక్తిగా జరగనుంది. జపాన్‌లో మార్కెట్‌ను విస్తరించాం. నాదల్, నిషికోరి పోరు ఆ దేశ అభిమానులను అలరించనుంది. ఇక ఢిల్లీలో డిసెంబర్‌ 10, 11, 12 తేదీల్లో జరిగే మ్యాచ్‌ల కోసం భారత ప్రేక్షకులు ఎదురు చూస్తున్నార’ని శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో భూపతి తెలిపాడు. 
 
కాగా, ఈ టోర్నీ టిక్కెట్ల విక్రయాలు సోమవారం నుంచి ‘బుక్‌ మై షో’లో ప్రారంభంకానున్నాయి. ముందుగా బుక్‌ చేసుకునే వారికి కొంత డిస్కౌంట్‌ లభిస్తుందని తెలిపారు. ఈ టోర్నీలో ఇండియన్‌ ఏసెస్‌, జపాన్‌ వారియర్స్‌, ఫిలిప్పీన్‌ మేవ్‌రిక్స్‌, సింగపూర్‌ స్లామర్స్‌, యూఏఈ రాయల్స్‌ పోటీ పడతాయని చెప్పారు.