బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (18:16 IST)

పీకేఎల్ గెలుపు: ట్వీట్స్‌తో అభిషేక్ బచ్చన్, ఐష్ హ్యాపీ!

కబడ్డీ లీగ్‌ ప్రారంభ ఎడిషన్‌లో బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌కు చెందిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ టైటిల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జైపూర్‌ 35-24తో ముంబై యు జట్టుపై ఘన విజయం సాధించింది. 
 
తమ జట్టు విజయం సాధించడంతో జట్టు యజమాని అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మనీందర్‌ సింగ్‌ ఏడు, రాజేష్‌ నర్వాల్‌ ఐదు పాయింట్లతో జైపూర్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.
 
ముంబై యు స్టార్‌ రైడర్‌, కెప్టెప్‌ అనూప్‌ కుమార్‌ 11 పాయింట్లతో చెలరేగినా జట్టుకు విజయం సాధించిపెట్టలేపోయాడు. జైపూర్‌ దుర్భేద్యమైన డిఫెన్స్‌ ముందు ముంబై యు చతికిలపడిపోయింది. అద్భుత డిఫెన్స్‌తో జైపూర్‌ 11 పాయింట్లు కాపాడుకోగా, ముంబై 4 పాయింట్లు మాత్రమే కాపాడుకోగలిగింది. 
 
తొలి లీగ్‌‌లో టైటిల్‌ నెగ్గిన జైపూర్‌ పాంథర్స్‌ జట్టు రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీ గెలుచుకుంది. రన్నరప్‌ ముంబై యుకి రూ. 25 లక్షలు దక్కాయి.
 
ఇక తెలుగు టైటాన్స్‌ ఆటగాడు రాహుల్‌ చౌదరి ‘బెస్ట్‌ రైడర్‌' అవార్డు సొంతం చేసుకోగా, అనూప్‌ కుమార్‌ ‘మోస్ట్‌ వాల్యబుల్‌ ప్లేయర్‌'గా నిలిచాడు.
 
ఇకపోతే.. ప్రో కబడ్డీ లీగ్‌లో విజయం సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్ యజమాని అభిషేక్ బచ్చన్‌కు బాలీవుడ్ స్టార్లు ట్విట్టర్ పోస్టుల ద్వారా అభినందనలు తెలిపారు. అమితాబ్ బచ్చన్ తమ టీం విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేస్తూ తమ జట్టు ప్రదర్శన అద్భుతమని కొనియాడారు. 
 
ఉదయ్ చోప్రా, అలియా భట్, బిపాసా బసు, మనోజ్ బాజ్‌పాయి లాంటి నటులు అభిషేక్ బచ్చన్‌కు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.