గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (16:31 IST)

ఏడ్చిన సరితాదేవి: కుమారుడు గుర్తు పట్టలేదు.. పతకం వద్దు!

భారత కీర్తిపతాకను వినువీధుల్లో ఎగురేయాలన్న ఆమె కోరిక ఫలించింది అయినప్పటికీ ఆమె ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. మగాళ్లకు ధీటుగా పిడుగుల్లాటి పంచ్‌లు కురిపించే ఆమె, తనకు జరిగిన అన్యాయాన్ని నిలదీసినప్పటికీ ఫలితం లేకపోవడంతో బేలగా మారింది. చిన్నపిల్లలా తన అసహాయతకు గుక్క పట్టి ఏడ్చింది. ఎంత మంది ఓదార్చినప్పటికీ భారత బాక్సర్ సరితా దేవి ఏడుపు ఆపలేకపోయింది. 
 
60 కేజీల మహిళల బాక్సింగ్‌లో సెమీ ఫైనల్ బౌట్‌లో సరితా దేవి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆటను చూసిన వారే కాకుండా, కామెంటేటర్లు కూడా సరితా దేవి విజయం సాధించిందని భావించారు. కానీ అనూహ్యంగా ఆమె ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. దీంతో సరితా దేవి తనకు జరిగిన అన్యాయాన్ని అంపైర్‌తో ప్రస్తావించింది. అప్పీల్ చేసింది. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సరితా దేవి కాంస్య పతకథారణకు నిరాకరించింది. 
 
ఆమె ఏడుస్తూ కాంస్య పతకాన్ని చేతుల్లోకి తీసుకుంది. దీంతో సెమీస్ లో ఆమె ప్రత్యర్ధి జీనా పార్క్ వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. తనకు ఎవరిమీదా కోపం లేదని ప్రకటించింది. న్యాయ నిర్ణేతల తీరు సమంజసం కాదని, ఇలాంటి ఫలితాలు క్రీడాకారుల ప్రతిభపై ప్రభావం చూపుతాయని ఆమె పేర్కొన్నారు. తనకు వచ్చిన పతకాన్ని కూడా రజత పతక విజేత జీనా పార్క్‌కు ఇచ్చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని జీనా పార్క్ పతకాన్ని పోడియంపై వదిలేసి వెళ్లిపోయారు. 
 
నిర్వాహకులు కాంస్యపతకం తమవద్దే ఉంచుకున్నారు. ఏడాదిన్నర బాబును కూడా పక్కన పెట్టి ఆసియా క్రీడల కోసం కఠోర సాధన చేశానని, ఒక దశలో తన కుమారుడు కూడా తనను గుర్తు పట్టలేదని ఆమె తెలిపారు.  
 
తనకు పతకం అక్కర్లేదు కనుకే పతకాన్ని కొరియన్లకు ఇచ్చేశానని ఆమె స్పష్టం చేశారు. తరువాత ఎదురయ్యే ఎలాంటి పరిణామాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఆమె భర్త, ఆమెకు పూర్తి మద్దతు తెలిపారు.