సల్మాన్ నియామకం వల్ల ప్రయోజనమేంటి : యోగీశ్వర్ దత్
ఒలింపిక్స్కు భారత బృందానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను గుడ్విల్ అంబాసిడర్గా నియమించటంపై పలువురు భారత క్రీడాకారులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఈ చర్యను ఖండిస్తున్నారు. ఈ కోవలో భారత మల్లయోధుడు యోగీశ్వర్ దత్ స్పందిస్తూ.. క్రీడలకు సంబంధించిన వ్యక్తిని అంబాసిడర్ నియమించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అసలు క్రీడాభివృద్ధికి సల్మాన్ చేసిన ఒక్క మంచి పనిని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సల్మాన్ఖాన్ తన కొత్త చిత్రం 'సుల్తాన్'లో మల్లయోధుడుగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో భారత ఒలింపిక్ అసోసియేషన్ సల్మాన్ను గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది. మహిళా బాక్సర్ మేరీకోమ్, హాకీ కెప్టెన్ సర్దార్సింగ్, షూటర్ అపూర్వి చందేలాలు కూడా అంబాసిడర్లుగా నియమితులయ్యారు.
దీనిపై యోగీశ్వర్ దత్ మండిపడ్డారు. 'ఆ నియామకం వల్ల క్రీడాకారులకు ఏ ప్రయోజనం చేకూరిందో అర్థంకావటం లేదు. సినిమాలను ప్రచారం చేసుకోవడానికి దేశంలో అందరికీ హక్కు ఉంది. అయితే అందుకు ఒలింపిక్స్ మాత్రం సరైన వేదిక మాత్రం కాదు. గుడ్విల్ అంబాసిడర్ పాత్ర ఏమిటో ఎవరైనా చెప్తారా? ప్రజలను మభ్యపెట్టడం ఎందుకు?' అంటూ విమర్శలు గుప్పించాడు.