బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (14:57 IST)

కేసీఆర్ ఓ బ్రోకర్.. లోఫర్.. మోడీని చూస్తే కేసీఆర్ లాగు తడిసిపోద్ది : ఉత్తమ్

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌పై టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలదాడి చేశారు. కేసీఆర్‌ను ఓ బ్రోకర్‌తో పోల్చారు. ప్రధాని నరేంద్ర మోడీని చూస్తే కేసీఆర్ లాగు తడుస్తుందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైందనీ, ఇందులో వ్యక్తిగతంగా కూడా తన పాత్ర ఎంతో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
సోమవారం హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశంలో సిగ్గూ శరం లేని రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కేసీఆర్ మాత్రమేనన్నారు. తెరాస పాలనలో పేదలకు లబ్ది చేకూరలేదని ధ్వజమెత్తారు. అణగారినవర్గాలకు మాట్లాడే అవకాశం కేసీఆర్‌ ఇవ్వలేదన్నారు. ఎంతో మంది కష్ట ఫలితమే తెలంగాణ అని, కష్టతరమైనా సోనియా తెలంగాణ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. 
 
సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. తెలంగాణ ఇచ్చినవారిని కేసీఆర్‌ కించపర్చుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టులదీ కీలకపాత్రేనని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటులో తన వ్యక్తిగత పాత్ర ఉందన్నారు. 
 
ఇకపోతే, ప్రధాని నరేంద్ర మోడీని చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ లాగు తడుస్తుందని ఎద్దేవా చేశారు. మోడీకి భయపడి ఆయనతో కేసీఆర్ లాలూచీ పడ్డారన్నారు. తెలంగాణ ఇవ్వడాన్ని పార్లమెంటులో మోడీ పార్లమెంటులో తప్పుబట్టారని ఉత్తమ్ గుర్తుచేశారు. అన్ని పార్టీల నేతలను కొనుక్కున్న నీచ చరిత్ర కేసీఆర్‌ది అని చెప్పారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సామాన్యులు బతకలేరని అన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చెప్పారు. జనాలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ పిట్ట కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా సక్రమంగా ఇవ్వలేదని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, తానే గద్దెనెక్కాడని విమర్శించారు. 
 
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేయవద్దని చంద్రబాబు అడ్డుపడ్డారా? అని నిలదీశారు. యావత్ భారతదేశంలో కేసీఆర్‌కు మించిన అబద్ధాలకోరు లేరన్నారు. ఓటమి భయంతోనే మహాకూటమిపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణను నిలిపారని మండిపడ్డారు. ప్రభుత్వం కంటే ప్రతిపక్షమే మంచి పాత్ర పోషించిందని చెప్పారు. అంతేకాకుండా, కేసీఆర్ మాదిరిగా బ్రోకర్ బతుకు బతికి తాము రాజకీయాల్లోకి రాలేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.