శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (23:00 IST)

భార్య ముక్కు, చెవులు కోసిన 'మృగం' మొగుడు

పరాయి పురుషునితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య చెవులు, ముక్కును ఓ కసాయి భర్త కోసేశాడు. ఈ తరహా సంఘటనలు ఎప్పుడో త్రేతాయుగంలో రామాయణంలో శూర్పణఖ ముక్కుచెవులు కోశారని చిన్నపుడు చదువునివుంటాం. అయితే, ఈ కలియుగంలో కూడా ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 
 
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం గొల్లబుద్ధాపురంకు చెందిన రజిత, శ్రీనివాస్ అనే దంపతులు ఉన్నారు. భార్య రజితపై భర్త శ్రీనివాస్‌కు గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై గత రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పడుకున్న భార్య చేతులు, కాళ్లను మంచానికి తాడుతో కట్టేసిన శ్రీనివాస్...ఆమె ముక్కు, చెవులు కోశాడు. 
 
తీవ్రంగా రక్తస్రావం అవుతూ మంచంలోనే పడి ఉన్న రజితను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో శ్రీనివాస్కు అతని తల్లి కూడా సహకరించినట్లు సమాచారం. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతున్నారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.