గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 6 జులై 2015 (08:50 IST)

మత్తయ్య సోదరుడిపై టీ పోలీసుల దాడి.. ఆధారాలు సేకరించిన ఏపీ పోలీసులు

ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య సోదరుడు ప్రభుదాస్‌ను కొట్టింది ఎవరో తెలిసిపోయింది. కేసులో మత్తయ్యను భయభ్రాంతులకు గురిచేసేక్రమంలో తెలంగాణ పోలీసులే ప్రభుదాస్‌‍ను కొట్టినట్టు ఏపీ సీఐడీ పోలీసులు ఆధారాలు సేకరించారు. మత్తయ్య కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురిచేసేచర్యల్లో భాగంగానే ఈ భౌతికదాడులకు దిగినట్టు తేల్చేశారు. 
 
అంతేకాకుండా, ప్రభుదాస్‌తో పాటు ఆయన భార్యకు కూడా తెలంగాణ పోలీసులు పలుమార్లు ఫోన్లు చేసి బెదిరించిన విషయంపై కూడా పక్కా ఆధారాలు లభ్యమైనట్టు సీఐడీ పోలీసులు చెపుతున్నారు. ఈ బెదిరింపులకు తెలంగాణ రాష్ట్ర పోలీసులతో పాటు అధికార తెరాస పార్టీ నేతలు కూడా పాల్పడినట్టు గుర్తించారు.
 
మత్తయ్య కుటుంబ సభ్యుల మొబైల్ కాల్‌డేటాను నిశితంగా పరిశీలించిన సీఐడీ అధికారులకు పలువురు టీఆర్ఎస్ నేతల ఫోన్ నెంబర్లను కూడా గుర్తించారు. దీనికి సంబంధించి మరింత పక్కాగా ఆధారాలు సేకరించి, ఆ తర్వాత ముందడుగు వేయాలని ఏపీ సీఐడీ భావిస్తోంది.