అమరావతి శంకుస్థాపన: టి.సీఎం కేసీఆర్కు బాబు ఆహ్వానం.. వస్తారా?
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అక్టోబర్ 22వ తేదీన అట్టహాసంగా జరుగనున్న అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విచ్ఛేయనున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఈ కార్యక్రమంలో ప్రముఖులు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారని తెలిసింది. ఈ సీఎం జాబితాలో కేసీఆర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమం గురించి మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ... అక్టోబర్ 22న మధ్యాహ్నం 12:35కి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు చోటుచేసుకుంటాయన్నారు. ఇంకా 23వేల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కొత్త దుస్తులు ఇస్తారని, అంతేగాకుండా.. శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎయిర్ షో కూడా నిర్వహించనున్నట్లు నారాయణ చెప్పారు.