బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 10 అక్టోబరు 2015 (13:48 IST)

మళ్లీ ఈసారి అలా చేస్తే తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తాం... బలరాం నాయక్ వార్నింగ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ ఆ పార్టీకి పెద్ద షాకిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటంలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఒకింత ఆవేశానికి లోనైనా బలరాం నాయక్.. మళ్లీ ఆ పని కనుక మీరు చేస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేస్తాం అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీరు తెరాసకు పట్టం కట్టారు. అందుకే అలా చేస్తాం అన్నారు. దీంతో సభా వేదికపై ఉన్న జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఇతర సీనియర్ నాయకులు అవాక్కయ్యారు. అరే.... ఏం మాట్లాడుతున్నావ్ బలరాం అనేసరికి తేరుకుని నాలుక్కరుచుకున్న బలరాం నాయక్... అబ్బే జస్ట్ జోక్ చేశానంతే అని ముఖంపై చమట తుడుచుకుంటూ కూర్చున్నారు. కానీ నాయక్ వ్యాఖ్యలపై తెరాస మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ కుట్రలు ఎలాంటివో చూస్తున్నారు కదా అంటూ విమర్శిస్తున్నారు.