బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (10:55 IST)

ఆగస్టులో మోడీ కేబినెట్ విస్తరణ : దత్తాత్రేయకు ఛాన్స్!

ఆగస్టు నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విస్తరణ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు అవకాశం దక్కనుంది. 
 
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఇటీవలే రెండు నెలలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో వచ్చే నెలలో మంత్రి మండలిని మోడీ విస్తరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 14తో ముగియనున్నాయి. 
 
ఈ సమావేశాలు ముగిసిన తర్వాత విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు ఈసారి కేంద్రమంత్రి పదవి దక్కనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో 22 మంది క్యాబినెట్, 22 మంది సహాయమంత్రులు ఉన్న విషయం తెల్సిందే.