శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (18:58 IST)

చిన్న రాష్ట్రాలకు ఎన్డీయే బీజం.. అందువల్లే తెలంగాణ : అమిత్ షా

గత ఎన్డీయే ప్రభుత్వం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజం వేయడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అదేసమయంలో తెలంగాణ కోసం తొలిసారి తీర్మానం చేసిన ఘనత తమదేనన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పార్టీ ఎంతగానో కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు. 
 
రెండు రోజుల పర్యటన కోసం గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గ్రేటర్ హైదరాబాద్ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. తెలంగాణ కోసం తొలుత తీర్మానం చేసింది బీజేపీయేనని గుర్తు చేశారు. తెలంగాణ కోసం మొదట నుంచి కృషి చేసింది బీజేపీయేనని తెలిపారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజం చేసింది నాటి ఎన్డీయే ప్రభుత్వమేనని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. 
 
గతంలో మూడు రాష్ట్రాలను బీజేపీ ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు కలసిమెలసి అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ రాజకీయాలతో రాష్ట్ర విభజనలో లోపాలు తలెత్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుత తరుణంలో దేశాన్ని రక్షించేది మోడీ నేతృత్వంలోని బీజేపీయేనని ఆయన స్పష్టం చేశారు.