గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By IVR
Last Modified: బుధవారం, 23 జులై 2014 (20:33 IST)

తెలంగాణ బ్రాండ్ కు పాకిస్థాన్ కోడలా... ఇదేమి చోద్యం...?

తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను నియమించడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణ బ్రాండ్ ను ఖండాంతరాలకు తీసుకెళ్లేందుకు పాకిస్థాన్ కోడలు తప్ప మరెవ్వరూ దొరకలేదా అంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, అసెంబ్లీలో బీజేపీ నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను ఆకట్టుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే టీఆర్ఎస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నదంటూ ఆరోపించారు.
 
మరోవైపు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఎంపిక కావడంతో.. ఆమెకు ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తాయి. ట్విట్టర్ ద్వారా ఆమె అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ తెలిపారు. ఇంకా పెద్ద ఎత్తున ఆమెకు ట్విట్టర్‌లో అభినందనలు అందుతూనే ఉన్నాయి.
 
అయితే టెన్నిస్ తార సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతోపాటు ఆమెకు కోటి రూపాయల నజరానాను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం పట్ల భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం మీద తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి లోకం, తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పలు ప్రశ్నలను సంధిస్తున్నారు. 
 
తెలుగు భాష రాని సానియా మీర్జా.. తెలంగాణ రాష్ట్రానికి ప్రచారకర్తనా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి 1956 నిబంధన విధించారు కదా.. మరి సానియా మీర్జా కుటుంబం 1956 ముందు నుంచే తెలంగాణలో వుందా? ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించుకుందా? అని అడుగుతున్నారు. సానియా మీర్జా తండ్రి మహారాష్ట్రలో జన్మించాడు. సానియా భర్త పాకిస్థాన్‌ వాసి. సానియా మీర్జా దుబాయ్‌లో శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుంది. అలాంటి సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడరా? ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
అంతేకాకుండా, సానియా మీర్జా తెలంగాణకు గర్వకారణమా? ఏరకంగా గర్వకారణం? జాతీయ పతాకాన్ని అవమానించడం తెలంగాణాకు గర్వకారణమా? ఆమె తెలంగాణ కోసం ఏం చేసిందని గర్వపడుతున్నారు? సానియా మీర్జా కనీసం తన కలలో అయినా జై తెలంగాణ అని నినాదం చేసి వుంటుందా? తెలంగాణ ఉద్యమానికి మద్దతు అయినా పలికిందా? టెన్నిస్ క్రీడ ద్వారా, టెన్నిస్ అకాడమీ స్థాపించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన సానియా మీర్జాకు కోటి రూపాయలు ఇచ్చారు. 
 
మరి ప్రాణాలకు తెగించి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఇద్దరు తెలంగాణ చిన్నారులకు ముష్టిగా రూ.25 లక్షలు చొప్పు ఇచ్చారు. ఇదేనా మీ న్యాయం.? ఎంతోమంది బంగారు తల్లులు వున్న తెలంగాణ గడ్డమీద తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడానికి అచ్చ తెలంగాణ ఆడపడుచు ఎవరూ కేసీఆర్ కంటికి కనిపించలేదా.? ఇత్యాది ప్రశ్నలు అనేకం సంధిస్తున్నారు.