బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 జులై 2017 (08:54 IST)

మూడేళ్లు వాడుకున్నావు. మూడు లక్షలు కక్కు.. ఈ రివర్స్ తర్కం ఖచ్చితంగా పోలీసుదే..

మూడేళ్లు ఒక అనాథ యువతితో సహజీవనం చేసాక మోజు తీరిన యువకుడు వదిలి వెళ్లిపోతే, అతడి బంధువైన పోలీసు మామ ఒకరు ఆమెమీదే నేరం ఆరోపించి మూడేళ్లు బాగా వాడుకున్నావుగా. మూడు లక్షలు కక్కు అంటూ ఆ అనాధ యువతినే బెదిరించడం పోలీసు మార్కు తీర్పకాక మరొకటవుతుందా...

సాధారణంగా దాంపత్యం బ్రేక్ అయినప్పుడు అమ్మాయికి భరణం లేదా సహాయం ఏమిస్తావని పెద్దమనుషులు అడగటం, మహిళకు న్యాయం చేయడానికి ప్రయత్నించడం సహజం. దీనికి భిన్నంగా చాలా రేర్‌గా జరుగుతుంటుంది. మూడేళ్లు ఒక అనాథ యువతితో సహజీవనం చేసాక  మోజు తీరిన యువకుడు వదిలి వెళ్లిపోతే, అతడి బంధువైన పోలీసు మామ ఒకరు ఆమెమీదే నేరం ఆరోపించి మూడేళ్లు బాగా వాడుకున్నావుగా. మూడు లక్షలు కక్కు అంటూ ఆ అనాధ యువతినే బెదిరించడం పోలీసు మార్కు తీర్పకాక మరొకటవుతుందా... స్మార్ట్ పోలీసు అని చెప్పుకుంటున్న తెలంగాణలో ఒక పోలీసు నిర్వాకం ఇలా ఏడ్చింది.
 
నిజామాబాద్‌ బొధన్‌ మండలం శ్రీనగర్‌ కాలనీలో బేకరీషాపులో పనిచేసే రాజేష్‌ ఎదురుగా బట్టల షాపులో పనిచేసే ఒక అనాథ యువతిని ప్రేమించి  జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించి సంబంధంలోకి వచ్చాడు. మూడు సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేసి వదిలేసి వెళ్లాడు. కానీ తమ వాడిని మూడు సంవత్సరాలుగా వాడుకున్నందుకు మూడు లక్షల నష్ట పరిహరం చెల్లించాలని యువకుడి మేనమామ బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్‌ బొధన్‌ మండలం సత్తనపల్లికి చెందిన అనాథ యువతి శ్రీనగర్‌ కాలనీలోని ఓ బట్టల షాపులో పనిచేస్తుంది. షాపుకు ఎదురుగా బేకరీషాపులో పనిచేసే రాజేష్‌  సదరు యువతి మద్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటానని మాయమాటలు చెప్పి సహజీవనం కొనసాగించాడు. ఇద్దరు కలిసి ఎస్‌ఆర్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో ఓ ఇంట్లో ఉంటూ మూడు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.
 
ఇటీవల రాజేష్‌లో మార్పు వచ్చి ఆ యువతి ఎవరితో మాట్లాడినా అనుమానంతో చేయి చేసుకుంటుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సర్దిచెప్పగా పెళ్లి చేసుకుంటానని   చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత యువకుడి మేనమామ ఇంటికి వచ్చి ఇంట్లోని సామాగ్రిని అంతా తీసుకుని పోయాడు. దీనిపై యువతి అతడిని నిలదీయగా తమవాడిని వాడుకున్నందుకు  మూడు లక్షల నష్ట పరిహరం చెల్లించాలని బెదిరించడంతో పోలీసుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మేనమామ పోలీసుల విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది.
 
ఆ యువకుడి మేనమామ పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. తనదాకా వస్తే అన్ని రూల్సూ తల్లకిందులవడమే కదా పోలీసు న్యాయం అంటే.