శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (17:23 IST)

చంద్రబాబు ఫోన్‌చేసి బీజేపీలో చేరమంటే.. తొందరపడ్డాను: జగ్గారెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరమని.. మంచి భవిష్యత్ ఉందని చెప్పడంతోనే తొందరపడ్డానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాను తదుపరి ఎన్నికల్లో సంగారెడ్డిలో గెలిచితీరాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన నోటి దురుసుతోనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని, అధికార పార్టీకి ఉద్యోగులు దూరం కావడం కూడా తన ఓటమికి కారణమైందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 
 
సోమవారం పలువురు కాంగ్రెస్ నేతల సమక్షంలో జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కండువా కప్పి జగ్గారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. తాను బీజేపీలోకి ఎందుకు వెళ్లానో తెలియడం లేదని, ఆ సమయంలో ఏవేవో ఆలోచనలతో ఆ పార్టీలో చేరానన్నారు. 
 
తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతుల మృతులకు కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.