ఉస్మానియాలో ఉద్రిక్తత: 100 మంది అరెస్ట్.. కేసీఆర్ సర్కారుపై ఫైర్
గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. వర్శిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి విద్యార్థుల సమూహం ర్యాలీగా బయల్దేరగా, ఎన్సీసీ గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. అంతేగాకుండా గిరిజన ఐక్య కార్యచరణ సమితి నేతలతో పాటు 100 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు మాట్లాడుతూ.. గిరిజనులనకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తెలంగాణలోని కేసీఆర్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే అమలు చేయట్లేదని ఆరోపించారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ర్యాలీతో విద్యానగర్, నల్లకుంట ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.