శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pyr
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (05:55 IST)

బాబు తెలంగాణ ద్రోహి.. అడుగడుగునా అడ్డుకుంటున్నారు

చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అనీ, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయన తీరు చాలా మోసపూరితంగా ఉందనీ తెలంగాణ మంత్రి జదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణవాసులపై ఒకవైపు ప్రేమ ఒలకబోస్తూనే మరోవైపు అన్నింటా అడ్డుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో వితెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
 
తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను ఇబ్బందుల పాలు చేయడానికే ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు.  తెలంగాణ విషయంలో ఆయన వైఖరి నోటితో మాట్లాడి, నొసటితో వెక్కిరించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రానికి సీఎంను అన్న విషయం మరిచి పోయి, తెలంగాణ విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
 
కరీంనగర్ బహిరంగ సభలో విద్యుత్ అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తా .. అని అంటూ, మరో వైపు ఢిల్లీలో తన అధికారులతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి వద్ద కృష్ణపట్నం నుంచి తెలంగాణకు కరెంటు ఇవ్వబోమని చెప్పించారని వివరించారు. కార్పొరేషన్లను విడదీయడంలో, కృష్ణా, గోదావరి నీళ్ల విషయంలో పేచీలు పెడుతున్నారని అన్నారు. ఇలా తెలంగాణ సమస్యల పరిష్కారంలో అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.