శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 ఆగస్టు 2015 (17:17 IST)

కేసీఆర్ మెడలో చీప్ లిక్కర్ బాటిళ్ల దండ... ఓయూలో ఊరేగింపు

చీప్ లిక్కర్ తెలంగాణ సర్కారు మెడకు గుదిబండలా మారుతుందా అంటే అవుననే అంటున్నారు. చీప్ లిక్కర్ అమ్మకాన్ని తెలంగాణ ప్రభుత్వమే చేపట్టాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. ఇక రాజకీయ పార్టీల సంగతి సరేసరి. ఇవన్నీ ఇలావుంటే ఉద్యమాలకు నెలవుగా పేరు మోసిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు తమ నిరసనలను వినూత్నంగా చేపట్టారు. 
 
కేసీఆర్ చిత్ర పటానికి చీప్ లిక్కర్ బాటిళ్లను దండగా చేసి ఆ పటంతో అక్కడే ఊరేగించారు. చీప్ లిక్కర్‌ను ప్రభుత్వం అమ్మడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడే విధానాలను ప్రభుత్వం ఉపసంహిరించుకోవాలని, ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు చీప్ లిక్కర్‌తో చీప్ పాలిటిక్స్ చేయవద్దని హితవు పలికారు. తెలంగాణ కోసం ఎందరో విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంటే కేసీఆర్, వారి త్యాగాలను కించపరుస్తున్నారంటూ మండిపడ్డారు.