బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (11:19 IST)

ప్రభుత్వ వద్ద సూట్‌కేసుల్లో డబ్బుల్లేవ్.. ఒకేసారి రుణమాఫీ చేయలేం : కేసీఆర్

'ప్రభుత్వం దగ్గర సూట్‌కేసుల్లో డబ్బులుండవు. నల్ల డబ్బు అంతకంటే ఉండదు' అందువల్ల రైతులందరికీ రుణమాఫీ ఒకేసారి చేయలేమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. టీ అసెంబ్లీలో రెండు రోజుల పాటు సాగిన రైతుల సమస్యలపై చర్చ జరిగింది. దీనిపై కేసీఆర్ సమాధానమిస్తూ... రాష్ట్రంలో 36 లక్షల రైతు ఖాతాలున్నాయి. వీరందరికీ లక్ష రూపాయల లోపు ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలంటే రూ.8 వేల కోట్లు అవసరమవుతాయి. ఇంత పెద్ద మొత్తం ఒకేసారి సమకూర్చుకోవాలంటే ప్రభుత్వానికి కష్టం. ప్రభుత్వం దగ్గర సూట్‌కేసుల్లో డబ్బులుండవు. నల్ల డబ్బుండదు అని తేల్చి చెప్పారు. 
 
పైగా, రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో నిధులు రావాల్సి ఉందని, అవి సమకూరితే రుణమాఫీ అమలు చేసేందుకు తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల ద్వారా రూ.3500 కోట్లను రాబట్టే యత్నాల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి అదనంగా రూ.3500 కోట్లు వస్తాయి. ప్రభుత్వ స్థలాలను త్వరలో విక్రయిస్తాం. వాటి ద్వారా మరో 2, 3 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ నిధులన్నీ సమకూరితే రుణమాఫీ అమలకు తొలి ప్రాధాన్యమిస్తానని హామీ ఇచ్చారు. లేనిపక్షంలో దశలవారీగానే రుణమాఫీ చేస్తామన్నారు. 
 
రైతు ఆత్మహత్యల సమస్య ఒక్క తెలంగాణలోనే కాదని, దేశవ్యాప్తంగా ఉందన్నారు. రాత్రికి రాత్రే సమస్య పరిష్కారంకాదని స్పష్టంచేశారు. ‘తెలంగాణను తెచ్చుకుంది మీ చావులను చూడడానికి కాదు.. ప్లీజ్‌ ఆత్మహత్యలు వద్దు’ అని సీఎం కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.