వొంగమంటే పొర్లుదండాలు పెట్టే బాపతు అంటే వీరే..
పెద్దలంటే భక్తి ఉండాలి గానీ మరీ కాళ్లుపట్టుకుని మట్టి అద్దుకునే భక్తి చేటుకు చిహ్నమే అని నానుడి. దీన్ని అక్షరాలా నిరూపించి చూపుతామంటున్నారు ఈ అయ్యా ఎస్ అనబడే ఐఏఎస్లు. ముఖ్యమంత్రి కేసీఆర్కి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని శంకరాభరణం శంకరశాస్
పెద్దలంటే భక్తి ఉండాలి గానీ మరీ కాళ్లుపట్టుకుని మట్టి అద్దుకునే భక్తి చేటుకు చిహ్నమే అని నానుడి. దీన్ని అక్షరాలా నిరూపించి చూపుతామంటున్నారు ఈ అయ్యా ఎస్ అనబడే ఐఏఎస్లు. ముఖ్యమంత్రి కేసీఆర్కి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని శంకరాభరణం శంకరశాస్రి లెవల్లో ఒక కొత్త ఐఏఎస్ వీరభక్తి చూపిస్తే, మరో సబ్ కలెక్టర్ ఏకంగా కేసీఆర్ కూతురు మోకాళ్ల దగ్గర కూర్చుని ఆనందంగా ముచ్చట్లు పెడతారు. ఇదీ మన ఐఏఎస్లు.. కాదు కాదు మన అయ్యాఎస్ల కథ.
విషయానికి వస్తే తెలంగాణలో కొత్త జిల్లాల స్థాపన జరిగి వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో జగిత్యాల జిల్లాలో తొలి గణతంత్ర వేడుకలను నిర్వహించుకునే అవకాశం దక్కిందని ఉబ్బితబ్బిబ్బయిన ఆ జిల్లా కలెక్టర్ వందలాది ప్రజల ముందు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల పాదాభివందనాలతో భక్తిప్రపత్తులు ప్రదర్శించుకున్నారు.
‘జగిత్యాల నూతన జిల్లా జైత్రయాత్రలో సగౌరవంగా వంద రోజుల పాలన పూర్తి చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు దగ్గరగా చేరవేస్తున్న ఈ శుభ సందర్భంగా.. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన అద్భుతమైన, చరిత్రాత్మక ‘జగిత్యాల ఖిల్లా’లో తొలి గణతంత్ర వేడుకలను నిర్వహించే అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారికి.. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా...’ అంటూ జగిత్యాల కలెక్టర్ డాక్టర్ శరత్ గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దీంతో సభికుల్లో కలకలం చెలరేగింది.
మరోవైపున.. మెట్పల్లి సబ్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఏకంగా గ్యాలరీలో కూర్చొన్న సీఎం కుమార్తె, ఎంపీ కవిత దగ్గరికి వెళ్లి ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చొని ముచ్చటించారు. దీంతో కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు కలెక్టర్ శరత్.. సబ్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ వ్యవహారంపైనే సభికులు చర్చించుకున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ జిల్లాకు మచ్చ తెచ్చారని చర్చించుకున్నారు. ‘ఐఏఎస్ల తీరు.. నేతల పాదాలకు మోకరిల్లె చూడు.. పరేడ్ మైదానంలో ప్రజల సాక్షిగా తలవంపులు తెచ్చెను వీరు.’ అనే పోస్టు సోషల్ మీడియాలో గురు వారం హాట్టాపిక్గా మారింది.
ఐఏఎస్లు ఇలాంటి అయ్యాఎస్లుగా మారి పాలకులకు పొర్లు దండాలు పెడుతుంటే ఏలిన వారి పాలన చిత్తానుసారం సాగుతుందంటే సాగదా మరి.