శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (16:49 IST)

అవినీతి - అధికార దుర్వినియోగానికి లభించిన విజయం : ఎంపీ గుత్తా

వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు లభించిన గెలుపు అవినీతి, అధికార దుర్వినియోగానికి లభించిన విజయంగా అని కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 
 
తెరాసకు నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని గుత్తా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. అవసరమైతే టీడీపీతో కూడా తమ పార్టీ పొత్తుకు సిద్ధమని స్పష్టం చేశారు. 
 
ఇదిలావుండగా, ప్రభుత్వ వ్యతిరేకతే తమ బలమని బల్లగుద్ది మరీ చెప్పిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ప్రజలు షాకిచ్చారు. ఈ నెల 21వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పూర్తైంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయారు. 
 
మొత్తం 15 లక్షలకు పైగా ఓట్లున్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలో 10 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి ఏకంగా 6,15,407 ఓట్లను కొల్టగొట్టారు. ఇక ఈ ఎన్నికలో డిపాజిట్ దక్కించుకోవాలంటే 1.74 లక్షల ఓట్లు రావాల్సి ఉంది. అయితే ప్రతిపక్ష అభ్యర్థి ఏ ఒక్కరు కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ 1,56,315 ఓట్లు సాధించగా, ఎన్డీఏ అభ్యర్థి దేవయ్య 1,30,178 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ రావుకు 23,325 ఓట్లు పడగా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన భాస్కర్‌కు 28,540 ఓట్లు పడ్డాయి.