గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:18 IST)

బండి సంజయ్ దీక్ష కొనసాగింపు... తెలంగాణలో ఉద్రిక్తత

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు.

ఎంపీ కార్యాలయంలోనే దీక్షకు ఉపక్రమించిన సంజయ్, రాత్రి నేలపై పడుకొని తన నిరసనను తెలిపారు. సంజయ్ దీక్షకు సంఘీభావంగా బయట కార్యకర్తలు బైఠాయించి ఆందోళన కొనసాగించారు.

పోలీసుల వ్యవహార శైలి గురించి బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తాను సిద్దిపేటకు వెళ్తే, సీపీ జోయల్ డేవిస్ తనపై దాడి చేసి అక్రమంగా కరీంనగర్‌కు తరలించారని ఆరోపించారు.

సీపీని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దుబ్బాకలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే, బీజేపీ గెలుపు తథ్యమని భావించిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, అధికారులను ఉసిగొలిపి అరాచకాలకు పాల్పడుతుందని విమర్శించారు.

సిద్దిపేటలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు, ఆయన వారి బంధువుల ఇళ్లలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించారని, పోలీసులు డబ్బులు పెట్టి దొరికినట్లు చూపించారని ఆరోపించారు.

ఇక రెచ్చగొట్టే చర్యలకు దిగినా, కార్యకర్తలు సమన్వయం పాటించి దుబ్బాక నియోజకవర్గంలోని బూత్ లెవల్ కార్యకర్తలు యథావిధిగా ప్రచారం కొనసాగించాలని సంజయ్‌ కోరారు. సిద్దిపేట సంఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, కేంద్ర బలగాలను పంపించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా.. ఎంపీ బండి సంజయ్‌పై పోలీసుల దాడికి నిరసనగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ, బీజేవైఎం ప్రగతి భవన్‌ ముట్టడికి నేడు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
 
 
కిషన్ రెడ్డి సీరియస్.. 
కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పోలీసులు, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. 
 
సిద్ధిపేటలో జరిగిన ఘటనలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులకు చెబుతామన్న ఆయన... అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. సిద్ధిపేటలోని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ ఇంటికి గత రాత్రి కిషన్‌రెడ్డి వెళ్లారు.

అక్కడ పరిస్థితిని సమీక్షించి... కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పోలీసులు సోదాలు చేసిన గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు జరిగిన ఘటనను కిషన్ రెడ్డికి వివరించారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే సివిల్‌ డ్రెస్సుల్లో పోలీసులు రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో తనిఖీలు చేశారన్నారు.