శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 19 ఆగస్టు 2014 (20:33 IST)

సమగ్ర సర్వే... పర్సనల్ డిటైల్స్ ప్రమాదం.. దాసరి, ఇంట్లో ఉన్నా రాలేదు... జేసీ

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేపై సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ఉద్దేశం మంచిదైతే అందరికీ మంచిదేననీ, తప్పుడు రేషన్ కార్డులను ఏరి వేయడానికి, లబ్ధిదారులను ఎంపిక చేసేందుకే అయితే మంచి జరుగుతుందన్నారు. ఐతే ఉద్దేశ్యం ఇదే అయితే వ్యక్తిగత వివరాలతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. 
 
వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవాలనుకోవడం తీవ్ర పరిస్థితులకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సమగ్ర సర్వే కోసం తన ఇంటికి ఎవరూ రాలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వాళ్లు తమ ఇంటికి ఎందుకు రాలేదో తనకు తెలియదన్నారు. హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారెవరూ హైదరాబాద్ విడిచివెళ్లాలనుకోవడం లేదని చెప్పారు. కొన్నిచోట్ల సొంత ఇళ్లున్నవారిని స్థానికులు కాదంటూ వదిలేయడం సరైన పద్ధతి కాదని అన్నారు జేసీ.