గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సందీప్ రేవిళ్ళ
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (16:10 IST)

సహోద్యోగినితో సన్నిహితంగా ఫోన్ సంభాషణ... పిల్లలకి విషమిచ్చి తాగేసింది....

భర్తపై అనుమానంతో ఓ మహిళ తాను ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నించడమే కాకుండా పిల్లలకు కూడా విషం పెట్టింది. వారిలో కూతురు మరణించగా తల్లీకొడుకుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ విషాద సంఘటన బుధవారం మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
మియాపూర్‌ సీఐ వెంకటేష్‌, ఎస్‌ఐ శ్రీరాంరెడ్డి చెప్పిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా చందబావి గ్రామానికి చెందిన సురేశ్, సుమ అనే దంపతులు రెండు సంవత్సరాల నుండి మియాపూర్ లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. సురేశ్ బాచుపల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో ఏవోగా పనిచేస్తున్నాడు. వారికి హర్షిత (5). హర్ష (5) కవల పిల్లలు ఉన్నారు. 
 
బుధవారం సాయంత్రం సురేశ్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు. అక్కడ భార్యాపిల్లలు అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే 108కి ఫోన్ చేశాడు. కాసేపటికి 108 సిబ్బంది వచ్చి బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో హర్షిత మృతి చెందగా, హర్ష, సుమల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గుర్తుతెలియని విషం తీసుకున్నందువల్లే ఇలా జరిగిందని చెప్పారు. పిల్లలు ఇద్దరూ స్థానికంగా ఉన్న పాఠశాలలో యూకేజీ చదువుకుంటున్నారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అన్యోన్యంగా ఉన్న దాంపత్యంతో ఇటీవల చోటుచేసుకున్న కలహాలే ఈ దారుణానికి కారణం అని కాలనీవాసులు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. భర్త తను పనిచేసే కంపెనీలో సహోద్యోగితో చనువుగా ఉండటం, తరచూ ఫోన్‌లలో సంభాషించుకోవడం వలనే ఈ కలహాలు వచ్చాయని సమాచారం. సహోద్యోగులు, బంధువుల నుండి పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.