తెలంగాణ జిల్లాల్లో భూకంప వదంతులు... రాత్రంతా రోడ్లపైనే జాగారం!
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించినట్టుగా వదంతులు పుట్టుకొచ్చాయి. దీంతో ఈ జిల్లాల వాసులు రోడ్లపైనే జాగారం చేశారు. మళ్ళీ భూకంపం వస్తుందన్న భయంతో తాము ఇళ్ళలోకి వెళ్ళడానికి భయపడ్డారు. ఈ భూకంపం పుకార్లు ఫోన్ల ద్వారా వ్యాపించినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ఏ ప్రాంతంలో కూడా భూకంపం రాలేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
దీనికి తోడు భూకంప పుకార్లు సెల్ఫోన్ల ద్వారా మూరుమూల గ్రామాలకు పాకి పోవటంతో ఎవరికి వారు తమ బంధువులకు ఫోన్లు ద్వారా సమాచారం అందించారు. దాంతో వారు కూడా నిద్ర పోకుండా జాగారం చేశారు. కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భూకంప వదంతులు షికార్లు చేశాయి. కాగా భూకంప వదంతులను ఆ శాఖ కొట్టిపారేసింది. వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించింది.