శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (16:49 IST)

కేసీఆర్‌కు చావుడప్పు మోగించినవారే ఇపుడు పల్లకీ మోస్తున్నారు : ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్న టీ టీడీపీ ఎమ్మెల్యేలపై టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లోపాయికారిగా ఇచ్చే హామీలకు ఆశపడే వారంతా తెరాసలో చేరుతున్నారని విమర్శించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇపుడు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌ చేరిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. కేసీఆర్‌.. ముందు వారితో పదవులకు రాజీనామా చేయించి.. తర్వాత పార్టీలోకి తీసుకోవాలన్నారు. 
 
ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే‌లు కాంగ్రెస్‌, టీడీపీలో చేరితే వాళ్ల ఇళ్ల ముందు చావు డప్పు కొట్టించి పదవులకు రాజీనామా చేసే వరకు నిరసన చేపట్టిన విషయాన్ని కేసీఆర్‌ సీఎం అయ్యాక మరచిపోయారా అంటూ మండిపడ్డారు. 
 
రాజకీయ నైతిక విలువలున్నా, పార్లమెంట్‌ వ్యవస్థపై నమ్మకం ఉన్నా.. తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ పదవులతో పాటు పార్టీ పదవులకూ రాజీనామాచేయాలని తెలుగు యువత రాష్ట్ర కన్వీనర్‌ వీరేందర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.