ఎర్రబెల్లి, కడియం పరస్పర విమర్శలు ఎందుకు...
వరంగల్ జిల్లా జడ్.పి. సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరిలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. నువ్వా నేనా అంటూ పోటాపోటీగా అరుచుకున్నారు. ఎంపీ కడియం, ఎర్రబెల్లి మధ్య ఎరువుల కొరతపై చర్చ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. టిఆర్ఎస్ పార్టీలో చేరతానని తనకు ఫోన్ చేయలేదా? అని కడియం అనడంతో మరింత వేడెక్కింది.
రాజకీయాలకు ఇది వేదిక కాదని ఎర్రబెల్లి.. కడియంకు సూచించారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎర్రబెల్లి తాను టిడిపిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.