టీఆర్ఎస్లో చేరనున్న టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు!
అందరూ ఊహించినట్టే జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకర్షణకు లోనయ్యారు. ఫలితంగా.. ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీని వీడి ఎర్రబెల్లి టీఆర్ఎస్లోకి వెళుతున్నారని పరకాల టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీపీ మరో నేత రేవంత్ రెడ్డికి అధినేత చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో కినుకు వహించిన ఎర్రబెల్లి ఈ నిర్ణయం తీసుకునివుంటారని ఆయన చెపుతున్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తనను కూడా టీఆర్ఎస్లోకి రావాల్సిందిగా ఎర్రబెల్లి ఆహ్వానించారని... అయితే, ఆయన ఆఫర్ను తాను తిరస్కరించానని ధర్మారెడ్డి చెప్పారు. దసరా తర్వాత ఎర్రబెల్లి టీఆర్ఎస్ తీర్థం తీసుకోనున్నారని సమాచారం. తనతో పాటు ఆయన, మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్ రావును తమ పార్టీలోకి ఆకర్షించేందుకు టీఆర్ఎస్ ఆయనకు మంత్రి పదవిని ఆఫర్ను చేసినట్టు సమాచారం.