శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (13:42 IST)

రేవంత్ రెడ్డి.. భారతంలో అర్జునుడు లాంటివాడు : ఎర్రబెల్లి దయాకర్

తెలంగాణ టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి భారతంలో అర్జునుడు వంటివాడని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. వాడివేడిగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎర్రబెల్లి మరోమారు టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వైఖరిపై విమర్శలు గుప్పించారు. టీ సభలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా మహాభారతంలోని పాండవుల్లా సభలో యుద్ధం చేస్తున్నామని... టీఆర్ఎస్ సభ్యులు కౌరవ సమూహంతో సమానమన్నారు. 
 
రేవంత్ రెడ్డిని మహాభారతంలో అర్జునుడిగా ఎర్రబెల్లి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని చూస్తే టీఆర్ఎస్ నేతలకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలించే ఐదేళ్లూ తమను శని వెంటాడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ఏ తప్పు చేయకున్నా శిక్షను అనుభవిస్తున్నామని అన్నారు. 
 
కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని అధికారపక్షంపై మండిపడ్డారు. ఎన్నికల హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే సహించబోమని హెచ్చరించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.