గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (13:14 IST)

అమ్మాయిలతో నకిలీ నోట్ల చెలామణి.. నలుగురి అరెస్టు!

అందమైన అమ్మాయిలను ఏజెంట్లుగా పెట్టుకుని నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న ప్రధాన సూత్రధారితోపాటు ముగ్గురు అమ్మాయిలను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.500, రూ.1000 నకిలీ నోట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
హైదరాబాద్ ముషీరాబాద్‌ పరిధిలోని ప్రశాంతి టవర్స్‌‌లో లక్ష్మీనారాయణ (42) అనే వ్యక్తి లలితా ఎంటర్‌ప్రైజెస్ పేరిట టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద ఇ.అనిత (24), కె.సరిత(24), జి.హారిక(22) అనే ముగ్గురు అమ్మాయిలు పని చేస్తున్నారు. వీరికి ఎక్కువ కమిషన్ ఇచ్చి రూ.500, రూ.1000 రూపాయల నోట్లతో చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయిస్తూ నకిలీ నోట్లను మార్పిడి చేయిస్తున్నాడు. 
 
ఆసిఫ్‌ నగర్ జిర్రా ప్రాంతంలో లక్ష్మీనారాయణ బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండగా టప్పాచబుత్ర పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా రూ.36 వేల నకిలీ నోట్లు బయపడ్డాయి. దీంతో లక్ష్మీనారాయణను తమదైన శైలిలో విచారించగా, తనకు అనంతపురానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి నకిలీ నోట్లు అందిస్తున్నట్లు వెల్లడించాడు. శ్రీనాథ్‌రెడ్డిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.