శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 నవంబరు 2014 (20:57 IST)

5 నెలల ఆరాధ్య.. నా బిడ్డ కాదంటూ చంపేసిన రాక్షస తండ్రి

కర్కశకుడు, అనుమాన పిశాచి, నరరూప రాక్షసుడు అనుమానంతో 5 నెలల కన్న బిడ్డనే చంపేశాడు. ఇటీవలే తన భార్యతో సరసానికి అడ్డుగా ఉందంటూ ఓ బాబాయ్ ఆరాధ్య అనే చిన్నారిని పొట్టనబెట్టుకున్న ఘటన మరవకముందే.. మరో తండ్రి పాశవిక చర్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఈ దుర్మార్గపు తండ్రి తన ఐదు నెలల చిన్నారిని హతమార్చాడు. ఆ చిన్నారి తనకు పుట్టిన బిడ్డ కాదని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
ఈ సంఘటన మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలం డప్పూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. హత్నూర్ ఎస్‌ఐ లవ్‌కుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన స్రవంతికి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన దశరథ్‌తో 2013 డిసెంబర్‌లో వివాహం జరిగింది.
 
అయితే పెళ్లికి ముందే వారికి శారీరక సంబంధముంది. దీంతో స్రవంతి గర్భం దాల్చింది. అయితే, దశరథ్ ఆమెను అనుమానిస్తూ అక్టోబర్‌లో గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. పెద్దలు భార్యాభర్తలకు నచ్చజెప్పి పంపారు. 
 
కొంతకాలం వరకు వారు కలసిమెలసి ఉన్నారు. ఈ క్రమంలో గర్భం దాల్చిన స్రవంతి కాన్పు కోసం జూన్‌లో పుట్టినిల్లు అయిన డప్పూర్‌కు వచ్చింది. ఐదు నెలల క్రితం స్రవంతి కుమార్తెకు జన్మనిచ్చింది.
 
భార్యాపిల్లలను చూసేందుకు వచ్చిన దశరత్ బుధవారం సాయంత్రం కుమార్తెను ఆడిస్తూ భార్య స్రవంతికి సిగరెట్ తెమ్మని దుకాణానికి పంపాడు. ఆమె బయటకు వెళ్లిన క్రమంలో పసిపాపపై దుప్పటి కప్పి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. 
 
అనంతరం అనుమానం రాకుండా ఊయలలో పడుకోబెట్టాడు. కాగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్న స్రవంతి.. ఎంత సేపైనా చిన్నారి ఏడవడం లేదని వచ్చి చూసేసరికి ఉలుకూపలుకు లేదు. ఎంత కదలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. 
 
తన భర్తే కుమార్తెను హత్య చేశాడని ఆమె గుండెలు బాదుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లవ్‌కుమార్ వివరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.