బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (16:25 IST)

దిగ్విజయ్ ఓ బ్లఫర్... తెలంగాణ ఇచ్చింది సోనియా.. తెచ్చింది కేసీఆర్ : డి శ్రీనివాస్

తెలుగు రాష్ట్రాల ఏఐసీసీ పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్‍పై ఆ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ తీవ్రవ్యాఖ్య చేశారు. దిగ్విజయ్ ఓ బ్లఫర్ అంటూ మండిపడ్డారు. ఆయన ఏదీ చెప్పడని, చెప్పుడు మాటలు వినే రకమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ పదవి తనకు చాలా చిన్నదని, పదవుల కోసం తాను కాంగ్రెస్ పార్టీని వీడలేదని డీఎస్ స్పష్టంచేశారు. 
 
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎన్నో అవకాశాలను ఇచ్చిన పార్టీ అధినేత్రి సోనియాకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. 1969లో గాంధీభవన్‌లో అడుగుపెట్టానని గుర్తు చేసుకున్న ఆయన... 2000లో తెలంగాణ గురించి అసెంబ్లీలో మాట్లాడానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడటం ఎంతో బాధిస్తోందని... తన జీవితంలో ఈ రోజు ఎంతో దురదృష్టకరమైనదని చెప్పారు. 
 
ఇకపోతే దిగ్విజయ్ తన పట్ల దిగజారి మాట్లాడారని... ఎమ్మెల్సీ పదవి తనకు ఒక లెక్క కాదన్నారు. చెప్పుడు మాటలు విని మాట్లాడుతున్న దిగ్విజయ్ 'ఓ బ్లఫర్' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గురించి మాట్లాడటానికి దిగ్విజయ్‌కు ఎంత ధైర్యం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వందల బీఫామ్‌లు ఇచ్చిన తనకు ఎమ్మెల్సీ ఓ లెక్కా? అని ప్రశ్నించారు. ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో తనకు ఎన్నో పదవులు వచ్చాయని... అవమానాలు కూడా ఎదురయ్యాయని, అవన్నీ ఏనాడూ బయటకు చెప్పలేదన్నారు. 
 
ఇకపోతే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా అయితే, తెచ్చింది మాత్రం కేసీఆర్ అని చెప్పారు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఒక కమిట్‌మెంట్‌తో పనిచేశారన్నారు. తాను పదవులు ఆశించి తెరాసలో చేరడం లేదని స్పష్టం చేశారు. కేవలం తెలంగాణను అభివృద్ధి చేసే క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.