శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: శనివారం, 12 జులై 2014 (16:09 IST)

గద్వాల్ కోటలో పూస్తున్న గులాబీ పువ్వు

రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న గులాబీ పార్టీలో చేరేందుకు పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పదిమంది జెడ్పీటీసీ సభ్యులు రెడీగా ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం శాసన సభ్యులకు ఎర వేసిన గులాబీ దండు తాజాగా గద్వాల్ కోటమీద దృష్టి పెట్టింది. 
 
సాధారణ ఎన్నికలకు ముందు భారీగా వలసలను ప్రోత్సహించిన టీఆర్ఎస్ ఇప్పుడు గెలిచిన ఎంపీపీ,మున్సిపల్ చైర్మెన్లు, జడ్పీటీసీ సభ్యులపై వల విసిరింది. జడ్పీ చైర్మెన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మెజార్టీ లేకున్నా అనూహ్యంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ జడ్పీటీసీల సహకారంతో జడ్పీ పీఠాన్ని దక్కించుకుంది.
 
ఈ పరిణామాలతో బిత్తరపోయిన కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగినా ఫలితం లేకుండాపోయింది. ఆయా పార్టీల నుండి దాదాపు పన్నెండుమంది జడ్పీటీసీలు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపారు..అదే ఊపులో గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మెన్లను తమ వైపు ఆకర్షించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. 
 
కొందరు ఎంపీపీలు సైతం అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని భావించిన ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రలోభాల ఎర చూపి గులాబీవైపు మళ్లించేందుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 
 
అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఒక్కొక్కరిగా కాకుండా అందరినీ ఒకే వేదికమీద కండువాలను కప్పి తమ పార్టీలో చేరేందుకు సందర్భంకోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించడమే కాకుండా.. గులాబీ పార్టీ ప్రతిష్టను కూడా చాటుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇంతకాలం పాలమూరు జిల్లాలో చక్రం తిప్పిన డి.కె అరుణమ్మ తన వర్గం వారిని ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి