మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (10:34 IST)

ప్రేమోన్మాది ఘాతుకానికి సంధ్యారాణి మృతి

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి సంధ్యారాణి మృతిచెందింది. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఉన్మాదిగా మారిన కార్తీక్ అనే ప్రేమోన్మాది సంధ్యారాణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి సంధ్యారాణి మృతిచెందింది. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఉన్మాదిగా మారిన కార్తీక్ అనే ప్రేమోన్మాది సంధ్యారాణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సంధ్యారాణి శుక్రవారం ఉదయం కన్నుమూసింది. హైదరాబాద్‌లోని లాలాపేట ప్రాంతంకు చెందిన సంధ్యారాణిని ప్రేమిస్తూ వచ్చిన కార్తీక్ అనే యువకుడు, ఆమె తనను తిరస్కరించిందన్న కారణంతో, నడిరోడ్డుపై ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. 
 
లాలాపేటలోని భజనసమాజ్ వీధిలో సావిత్రమ్మ తన కూతురు సంధ్యారాణి(23), మరో ఇద్దరు కూతుర్లతో అద్దె ఇంట్లో నివశిస్తోంది. సంధ్యారాణి లాలాపేటలోని లక్కీట్రేడర్స్ అల్యూమినియం షాప్‌లో పని చేస్తోంది. సంధ్యారాణితో పాటు కార్తీక్ అనే వ్యక్తి అక్కడే పనిచేస్తూ లాలాపేటలోని ఇందిరానగర్‌లో బ్యాచిలర్‌గా అద్దెకు ఉండేవాడు. కొన్నాళ్ల క్రితమే పనిమానేసి వేరే దగ్గర చేరాడు.
 
గురువారం సాయంత్రం సంధ్యారాణి షాప్‌కు వెళ్లి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా శాంతినగర్‌లోని ఎంసీహెచ్ కాలనీ, విద్యామందిర్ స్కూల్ వీధిలో ఎదురుగా ద్విచక్రవాహనంపై కార్తీక్ వచ్చాడు. సంధ్యారాణితో మాట్లాడుతూనే వెంట తెచ్చుకొన్న పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. కాలిపోతున్న యువతిని చూసిన స్థానికులు మంటలను అర్పి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఈ ఘటన గురువారం సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో లాలాపేట అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. ఈ ఘటనలో 70 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి తరలించిన బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో కార్తీక్ ఆ వెంటనే లొంగిపోగా, అతనిపై పెట్టిన హత్యాయత్నం కేసును, ఇప్పుడు హత్య కేసుగా మార్చనున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సంధ్య మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.