గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (10:05 IST)

గ్రేటర్ హైదరాబాద్‌లో జోరుగా సమగ్ర కుటుంబ సర్వే!

గ్రేటర్ హైదరాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వేకు ప్రారంభమైంది. సర్వేలో భాగంగా వివరాలందించేందుకు నగర ప్రజలు తమ గృహాల వద్ద ఎదురు చూస్తున్నారు. ఆది, సోమ వారాల్లో ప్రీ విజిట్ నిర్వహించిన ఎన్యూమరేటర్లు అందుబాటులోఉంచుకోవాల్సిన సమాచారం గురించి వివరించారు. నగర విస్తీర్ణం.. చిరునామాల్లో ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగరంలో రెండు రోజుల ప్రీ విజిట్ నిర్వహించారు. 
 
ఇంటింటికీ కరపత్రాలు అందజేశారు. విజిట్ చేసినట్లు స్టిక్కర్లు అంటించారు. అయినప్పటికీ.. తమ ఇంటికి రాలేదంటూ చాలా మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంట‌ర్‌కూ విరామం లేకుండా ఫిర్యాదుల వెల్లువ.. ఈ నేపథ్యంలో రెండు రోజుల విజిట్స్ అనుభవంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని.. సర్వేకు సంసిద్ధంగా ఉన్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.
 
కాగా, ఈ సర్వే మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మొదలై పూర్తయ్యేంత వరకు నిర్వహిస్తారు. ఇందులో 172 మంది నోడల్ ఆఫీసర్లు, 1500 మంది క్లస్టర్ ఇన్‌చార్జులు, 20 వేల మంది ఎన్యూమరేటర్లు, 42 వేల మంది అసిస్టెంట్ ఎన్యూమరేటర్లు పాల్గొంటారు. అలాగే, వీరికి పైస్థాయిలో జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, స్పెషల్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. కమిషనర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 40 ఇళ్లు.. అవసరాన్నిబట్టి  అదనపు అసిస్టెంట్లను నియమించుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు.