శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 18 జులై 2015 (13:27 IST)

తప్పు జరిగితే విపక్షాలు చీల్చిచెండాడుతాయి.. నిజాలు చెప్పండి : హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావుకు ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సంస్థ వ్యాప్కోస్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి నివేదికలు చేరకముందే సాగునీటి ప్రాజెక్టుల వివరాలు బయటకెలా పొక్కుతాయని ఆయన ఆ సంస్థ ప్రతినిధులను నిలదీశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నీటిప్రాజెక్టులపై ఉన్నదివున్నట్టు చెప్పండి... తప్పు జరిగితే.. చీల్చిచెండాడేందుకు ప్రతిపక్ష పార్టీలు కాచుకుని కూర్చొన్నాయంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఎస్ సర్కారు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సమావేశానికి హరీశ్ రావుతో పాటు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, వ్యాప్కోస్ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు చెప్పిన విషయాలను తారుమారు చేస్తూ వ్యాప్కోస్ చెబుతున్న వైనంపై ఆగ్రహంగా వున్న హరీశ్ రావు, సమావేశం ముగిసేదాకా ఓపిగ్గానే ఉన్నారు. సమీక్ష ముగిసి కేసీఆర్ ఛాంబర్ నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 
 
'ప్రభుత్వానికి వివరాలు అందకముందే మేడిగడ్డ ముంపు, కాళేశ్వరం -ఎల్లంపల్లి వివరాలు బయటకు ఎలా వెళ్లాయి? మీరు టెక్నికల్ కన్సల్టెంట్ సంస్థగా వ్యవహరించాలి. సీఎంగారు పూర్తిగా మీపైనే ఆధారపడి ఉన్నారు. చర్చలు జరిగేటప్పుడు వాస్తవాలు చెప్పండి. ముందేమో ముంపు లేదంటారు. ఇప్పుడేమో ఉందంటున్నారు. ఏది నమ్మాలో అర్థం కావడం లేదు. ఏదైనా తప్పు జరిగితే విమర్శించేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పండి' అంటూ వారిపై మండిపడ్డారు.